
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఉప్పు-నిప్పుగా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు మాటల యుద్దానికి దిగారు. అవకాశం దొరికినప్పుడల్లా భారత్పై మైఖేల్ వాన్ తన అక్కసును వెళ్లగక్కగా.. వసీం జాఫర్ అదిరిపోయే కౌంటరిచ్చాడు. ముఖ్యంగా టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చిన ప్రతీసారి మైఖేల్ వాన్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. జాఫర్ను ట్యాగ్ చేసేవాడు. దానికి జాఫర్ సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా 36 పరుగులకు ఆలైటనప్పటి నుంచి ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరకు ఈ ఇద్దరి మధ్య ఫన్నీగా మాటల యుద్దం సాగింది.
అయితే ఏమైందో ఏమో కానీ గత రెండు రోజులుగా మైఖేల్ వాన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. ఓవైపు బంగ్లాదేశ్ గడ్డపై ఇంగ్లండ్ టీ20 సిరీస్లో చిత్తుగా ఓడగా.. మరోవైపు మైఖేల్ వాన్ పత్తా లేకుండా పోయాడు. దాంతో వసీం జాఫర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'హలో మైఖేల్ వాన్.. చాలా రోజులైంది నిన్ను చూడక'అని ట్వీట్ చేశాడు. దీనికి బంగ్లాదేశ్ కోచ్ స్టాఫ్ డ్రెస్స్తో ఉన్న తన ఫొటోను జత చేశాడు.
ఈ ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో బదులిస్తున్నారు. ఇంగ్లండ్ ఆట తీరు చూసాక.. మైఖేల్ వాన్ దాక్కున్నాడని, పత్తా లేకుండా పోయాడని కామెంట్ చేస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్గా వసీం జాఫర్ సేవలందించాడు. ఇక మంగళవారం జరిగిన చివరి టీ20లోనూ ఇంగ్లండ్ 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది.
ఓపెనర్ లిటన్ దాస్(57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 73) హాఫ్ సెంచరీతో రాణించగా.. నజ్ముల్ హొస్సెన్ షాంటో(36 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 47 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ మలాన్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 40) విజయం కోసం పోరాడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.