
పంత్ వైఫల్యం..
అయితే, అందివచ్చిన అవకాశాన్ని పంత్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతని సారథ్యంలో ఆడిన తొలి రెండు టీ20ల్లో భారత్ ఓటమిపాలైంది. కెప్టెన్ పంత్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే టీమిండియా ఓటములు చవిచూస్తోందని పలువురు విమర్శించారు. తొలి టీ20లో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్తో మ్యాచ్ చివరి ఓవర్ ముందు వరకు రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడంతో పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు పంత్ కెప్టెన్సీ తీరుపై విమర్శలు గుప్పించారు.

తప్పుడు నిర్ణయాలతో..
అంతేకాకుండా, రెండో టీ20లో ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్లను తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్ కంటే ముందు అక్షర్ పటేల్ను పంపడాన్ని కూడా తప్పుబట్టారు. రెండో టీ20లో మిడిల్, డెత్ ఓవర్లలో పంత్ తన బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఈ నేపథ్యంలో పంత్ కెప్టెన్సీ గురించి భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాట్లాడాడు. మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పుడు రిషభ్ పంత్ భయపడుతున్నాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు.

అనుభవంతో..
పంత్ తన వ్యూహాల్లో మార్పులు చేస్తాడని, ఒకవేళ వాటి అమలు సరిగ్గా జరగకపోతే తొందరగా భయాందోళనలకు గురవుతున్నాడని జాఫర్ పేర్కొన్నాడు. 'పంత్ ఎన్ని ఎక్కువ మ్యాచ్లకు సారథ్యం వహిస్తే అంత మెరుగ్గా తయారవుతాడు. కానీ, ప్రస్తుతం అతను మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారినప్పుడు కొంచెం భయపడుతున్నాడు' అని వసీం జాఫర్ వివరించాడు.


Click it and Unblock the Notifications
