టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో కనిపించరని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఈ వెటరన్ ఆటగాళ్లు మెగా టోర్నీ తర్వాత టీ20 ప్రపంచకప్కు పూర్తిగా దూరమవుతారని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ చేతిలో సెమీస్ ఓడిన తర్వాత ఈ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లీ.. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత అఫ్గానిస్థాన్తో జరిగిన టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు.
తాజా టోర్నీలో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరూ ఐదు మ్యాచ్ల్లో 22, 12, 0, 11, 39 పరుగుల భాగస్వామ్యాలను మాత్రమే నెలకొల్పారు.

ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో వారే స్వతహాగా నిర్ణయం తీసుకోచ్చు. లేదా సెలెక్టర్లే వారిని టీ20 ఫార్మాట్కు దూరంగా పెట్టవచ్చు. ఐపీఎల్లో మాత్రం వారు కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ టీ ప్రపంచకప్లో భారత్ ఆడే చివరి మ్యాచ్ వారికి ఈ ఫార్మాట్లో ఆఖరిది నిలవనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీల రికార్డును అందుకునే అవకాశం విరాట్ కోహ్లీకి ఉంది. అతను 100 శతకాలు పూర్తి చేయగలడు. ప్రస్తుతం అతని ఫిట్నెస్ చూస్తుంటే కోహ్లీ చాలా రోజులు ఆటలో కొనసాగనున్నాడు. అతని నిలకడ ఫిట్నెస్ చూస్తుంటే ఈజీగా 100 సెంచరీలు చేస్తాడనిపిస్తోంది.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

35 ఏళ్ల వయసున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే 80 శతకాలు సాధించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్పై 80 శతకాన్ని అందుకున్నాడు. అతను మరో నాలుగేళ్ల పాటు ఆటలో కొనసాగే అవకాశం ఉంది. ఇదే జోరును కొనసాగిస్తే సునాయసంగా 100 శతకాలు సాధించగలడు.