
హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు తెరలేవనుంది. గురువారం నుంచి నాగ్పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్ మొదలవ్వనుంది. కీలక ఆటగాళ్లు లేకుండానే టీమిండియా ఈ సిరీస్ బరిలోకి దిగనుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. గాయం నుంచి కోలుకోకపోగా.. శ్రేయస్ అయ్యర్ వెన్నుగాయంతో తొలి టెస్ట్కు దూరమయ్యాడు. రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ పూర్తిగా జట్టుకు అందుబాటులో లేడు.
ఈ పరిస్థితుల్లో టీమ్ కాంబినేషన్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్కు సమస్యగా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మకు జతగా ఓపెనర్ ఎవరా? అనేది నిర్ణయించుకోలేకపోతుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడించాలా..? పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుస సెంచరీలతో చెలరేగుతున్న శుభ్మన్ గిల్కు ఇవ్వాలా? అనేది తేల్చుకోలేకపోతుంది. ఓవైపు సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను ఓపెనర్గా ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు సూచిస్తుండగా.. మరోవైపు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు టీమిండియా సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. తొలి టెస్ట్లో బరిలోకి దిగే భారత తుది జట్టును అంచనా వేసాడు. ట్విటర్ వేదికగా తన ప్రిడిక్షన్ వెల్లడించాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో జట్టును ఎంపిక చేసిన వసీం జాఫర్.. అక్షర్ పటేల్కు మొండి చెయ్యి చూపించాడు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసిన వసీం జాఫర్.. తప్పని పరిస్థితుల్లోనే అక్షర్ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు.
కుల్దీప్ యాదవ్ వెరైటీ రిస్ట్ స్పిన్నర్ కావడంతోనే అతని వైపు మొగ్గు చూపానని, అంతకు మించిన మరో కారణం లేదన్నాడు. ఇక ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ను కొనసాగించిన జాఫర్.. మిడిలార్డర్లో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లను ఎంచుకున్నాడు. వికెట్ కీపర్గా తెలుగు తేజం కేఎస్ భరత్ను తీసుకున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, అశ్విన్లను ఎంపిక చేయగా.. షమీ, సిరాజ్లను పేసర్లుగా తీసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ పేరును కూడా ప్రస్తావించలేదు.
వసీం జాఫర్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎస్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ