స్వింగ్ బంతులను ఆడలేడు..
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన వసీం జాఫర్ గైక్వాడ్ ఆటతీరును విశ్లేషించాడు. స్వింగ్ అయ్యే పిచ్లపై రుతురాజ్ ఆడలేడని, స్లో వికెట్లపై చెలరేగుతాడని చెప్పాడు. దేశవాళీ క్రికెట్లోనే అతనికి ఉన్న ఈ సమస్యను గుర్తించానని చెప్పాడు. 'రుతురాజ్ బ్యాటింగ్ చేసేటప్పుడు బంతి బ్యాట్ అంచులకు తాకి వికెట్ల వెనకాల దొరికిపోతాడు.
ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ ఇలాగే ఔటవ్వడం నేను చూశాను. ఈ మెగా టోర్నీలో ముంబైలోని పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి. దుబాయ్లోని పిచ్ల్లా కాకుండా ఇక్కడ బంతులు స్వింగ్ అవుతున్నాయి.
ఈ సమస్యను అధిగమించాలి..
గైక్వాడ్ మంచి ప్లేయరే అయినా తన తప్పులను సరిదిద్దుకునేందుకు ఒక మార్గాన్ని చూసుకోవాలి. దాంతో మళ్లీ రాణించి చెన్నైని విజయాలబాట పట్టించాలి' అని జాఫర్ సూచించాడు.మరోవైపు చెన్నై మాజీ ప్లేయర్ సామ్ కరణ్ సైతం ఆ జట్టుపై స్పందించాడు.. 'రుతురాజ్ ఎలాంటి అద్భుతమైన ఆటగాడో గత సీజన్లో మనందరికీ తెలియజేశాడు.
అయితే, ఇప్పుడతడు రాణించలేకపోతున్నాడు. చెన్నై జట్టులోనూ మంచి బ్యాటర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు. అయినా, ప్రస్తుత పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు' అని సామ్ కరణ్ అభిప్రాయపడ్డాడు.
రుతురాజ్కు అండగా ఉంటాం..
వరుసగా విఫలమవుతున్నా.. రుతురాజ్ గైక్వాడ్కు అండగా ఉంటామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా తెలిపాడు. అతనో అద్భుతమైన ఆటగాడని, త్వరలోనే ఫామ్ అందుకుంటాడని చెప్పాడు. 'రుతురాజ్ గైక్వాడ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయాల్సి అవసరం ఉంది. అతనికి అండగా ఉంటాం. అతను ఎంత మంచి ప్లేయరో మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా అతనికి అండగా నిలుస్తాం. అతి త్వరలోనే అతను చెలరేగుతాడు'అని జడేజా పేర్కొన్నాడు.
లివింగ్స్టోన్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 60) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్(33), జితేశ్ శర్మ(26) రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో, జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై.. 18 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే(57) మినహా అంతా విఫలమయ్యారు.