న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగా టోర్నీ ఆడే అదృష్టం ఎవరికి దక్కుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొద్దిమంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ.. మెగా టోర్నీకి ముందు జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో వారి సత్తాను పరిశీలించి తుది నిర్ణయానికి రానుంది.
గాయాలతో జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వేగంగా కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో జట్టులోకి వచ్చేది ఎవరు.. ఉద్వాసనకు గురయ్యేది ఎవరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగే జట్టును అంచనా వేసాడు.

తాను చీఫ్ సెలెక్టర్ అయితే ఎవరిని తీసుకునేవాడిననే విషయాన్ని వెల్లడించాడు. భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో జియోసినిమాతో మాట్లాడుతూ ప్రపంచకప్ జట్టు వివరాలను పంచుకున్నాడు. సీనియర్లకు పెద్ద పీట వేసిన వసీం జాఫర్.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను జట్టులోకి తీసుకున్నాడు.
కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా ఎంపిక చేసిన వసీం జాఫర్.. అతనికి బ్యాకప్గా సంజూ శాంసన్ను ఎంచుకున్నాడు. రిషభ్ పంత్ కోలుకుంటున్నాడనే వార్తలు వచ్చినా.. అతన్ని పట్టించుకోలేదు. రోడ్డు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడని, మునపటిలా ఆడలేడని పక్కనపెట్టేసాడు. బ్యాకప్ ఓపెనర్గా శుభ్మన్ గిల్కు అవకాశం కల్పించాడు.
విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లతో పాటు కుల్దీప్ యాదవ్కు అవకాశం కల్పించిన వసీం జాఫర్.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లతో పాటు చాహల్ను పక్కనపెట్టేసాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్లకు అవకాశం కల్పించాడు.
వసీం జాఫర్ వన్డే ప్రపంచకప్ టీమ్:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్