న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే తిలక్ వర్మ అద్బుత ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా క్లబ్ గేమ్ ఆడుతున్నట్లు సునాయసంగా పరుగులు చేశాడని తెలిపాడు.
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి టీ20తో తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైనా.. తిలక్ వర్మ బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. 22 బంతుల్లో 39 పరుగులతో క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడిన తిలిక్ వర్మ.. రెండు అసాధారణ క్యాచ్లతో ఔరా అనిపించాడు.

ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే రెండు సిక్స్లు బాది ఫియర్ లెస్ గేమ్ రుచి చూపించాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక వెస్టిండీస్తో ఆదివారం జరగనున్న రెండో టీ20 నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన వసీం జాఫర్ తిలక్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లెకుండా చెలరేగాడు. అతని బ్యాటింగ్ తీరు క్లబ్ లేదా స్టేట్ టీమ్కు ఆడుతున్నట్లుగా అనిపించింది. ఎక్కడా కూడా ఒత్తిడికి గురైనట్లు అనిపించలేదు. ఇది అతనిలో ఉన్న గొప్ప విషయం. ఇది అతను మానసికంగా చాలా బలంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తోంది.
బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై భారత బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక్కడే సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. విభిన్నమైన షాట్స్తో ఆకట్టుకున్నాడు. పెద్ద షాట్లే కాకుండా థర్డ్ మ్యాన్ దిశగా ఆడి సింగిల్స్ తీసిన విధానం బాగుంది. విభిన్నమైన షాట్లతో అతను సూపర్ ఫామ్లో ఉన్నాడనే విషయం తెలియజేస్తోంది.
అతను మరో 20 పరుగులు చేసుంటే భారత్ సునాయసంగా విజయం సాధించేది. సంజూ శాంసన్ రనౌట్ కూడా టీమిండియాకు తీరని నష్టం చేసింది.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.