
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు విజయం సాధించాలంటే ఎక్స్ట్రా బ్యాట్స్మన్తో బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించాడు. గత సిరీస్ ఫలితాలను పరిశీలిస్తే అదనపు బ్యాట్స్మన్ అవసరం అర్థమవుతుందని చెప్పాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆదివారం నుంచి మూడు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే వసీం జాఫర్ టీమ్ కాంబినేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్తో పాటు ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్తో బరిలోకి దిగాలన్నాడు.
'2018 సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన మూడు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో మాత్రమే 250కి పైగా పరుగులు చేసింది. అందుకే సిరీస్ కోల్పోయింది. మరో వైపు ఆడిన మూడు టెస్టుల్లో కూడా ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా పర్యటనకు అదనపు బ్యాటర్ అవసరమనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి నలుగురు ప్రధాన బౌలర్లతో పాటు ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగితే ఫలితముంటుంది' అని వసీమ్ జాఫర్ అభిప్రాపడ్డాడు. ఇదిలా ఉండగా, త్వరలో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంపై గందరగోళం నెలకొంది.
సౌతాఫ్రికా పిచ్లు పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉంటాయి గనుక నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్తో భారత్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు. అయితే ఎక్స్ట్రా బ్యాట్స్మన్ అవసరమనిపిస్తే మాత్రం హనుమ విహారీ లేదా అజింక్యా రహానే బరిలోకి దిగవచ్చు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా భారత్ నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్మూలాతోనే ఫలితాలను సాధించింది. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ను కొనసాగించే అవకాశాలున్నాయి.
ఇక ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టమని సౌతాఫ్రికా బౌలర్ ఒలివర్ అన్నాడు. అయినా అతనికి బౌలింగ్ చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. 'ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో నిండి ఉన్న టీమిండియా లాంటి బలమైన జట్టుతో టెస్టు సిరీస్ ఆడనుండటం నా కెరీర్లోనే మరిచిపోలేని విషయం. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడికి బౌలింగ్ చేయడం కష్టమే. అయినా, అతనికి బౌలింగ్ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. ఇక్కడి పిచ్ పరిస్థితులపై అవగాహన ఉండటం మాకు కలిసొచ్చే అంశం. బలమైన భారత జట్టును ఎదుర్కొనేందుకు పూర్తిగా సంసిద్ధమవుతున్నాం' అని ఒలివర్ అన్నాడు. ఇప్పటి వరకు 10 టెస్టులు ఆడిన ఒలివర్ 48 వికెట్లు పడగొట్టాడు. డిసెంబరు 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.