
న్యూఢిల్లీ: ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా పేలవ ప్రదర్శనతో కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకు గుండెకోతను మిగుల్చుతూ కనీసం సెమీస్కు చేరకుండానే వెనుదిరిగింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్.. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్పై భారీ విజయాలు సాధించి ఆశలు రేకెత్తించింది. కానీ ఆ ఆశలను చిదిమేస్తూ న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ను ఓడిస్తే ఎంచక్కా భారత్కు సెమీస్ బెర్త్ దక్కుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. సమష్టిగా రాణించిన న్యూజిలాండ్.. అఫ్గాన్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. దాంతో భారత్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక ఈ మ్యాచ్ ఫలితాన్ని ఉద్దేశించి క్రికెట్ పాకిస్థాన్ ఎగతాళిగా ట్వీట్ చేసింది. భారత అభిమానులను కించపరుస్తూ.. 'భారత అభిమానులారా? మీ ఫీలింగ్ ఎలా ఉంది?' అని ప్రశ్నించింది. ఈ ట్వీట్కు చిర్రెత్తుకుపోయిన భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. '12-1 మధ్య బాగా లంచ్ చేస్తే ఎలా ఉంటుందో అంత ఫుల్గా ఉంది'అని సెటైరికల్గా బదులిచ్చాడు. తన ట్వీట్లో జాఫర్ పరోక్షంగా పాకిస్థాన్పై టీ20 ప్రపంచకప్ల్లో భారత్ ఆధిపత్యాన్ని తెలియజేశాడు.
ఈ టీ20 ప్రపంచకప్ ముందు వరకు మెగా టోర్నీల్లో పాక్పై భారత్కు తిరుగులేదు. 12 మ్యాచ్లకు 12 భారత జట్టే గెలిచింది. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ల్లోనూ భారత చేతిలో పాక్కు భంగపాటు తప్ప లేదు. కానీ ఈ సారి ఆ రికార్డుకు బ్రేక్ వేస్తూ పాక్ అద్భుత విజయాన్నందుకుంది. ఫస్ట్ మ్యాచ్లోనే సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకుంది. లీగ్ దశలో ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచిన పాకిస్థాన్.. సెమీస్లో బుధవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఇక 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ఓ ఐసీసీ ఈవెంట్లో నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. నేడు సాయంత్రం జరిగే నామమాత్రమైన ఆఖరి మ్యాచ్లో నమీబియాతో భారత్ తలపడనుంది.