న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ను మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మందలించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయాలంటే ఓపికగా ఆడాలని, ఉరుకులాడితే కుదరదని సూచించాడు. కెరీర్లో తొలిసారి విండీస్ పర్యటనకు వెళ్లిన శుభ్మన్ గిల్.. యశస్వి జైస్వాల్ కోసం తన ఓపెనింగ్ స్లాట్ను త్యాగం చేశాడు.
ఫస్ట్ డౌన్ బ్యాటర్గా అవతారమెత్తాడు. యశస్వీ జైస్వాల్ అరంగేట్రంలోనే సెంచరీ బాది.. రెండో టెస్ట్లో హాఫ్ సెంచరీతో మెరవగా..శుభ్మన్ గిల్ మాత్రం రెండు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్స్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
జియోసినిమాతో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ తీరుపై స్పందించిన వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఫస్ట్ డౌన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకోవడం అభినందనీయం. అయితే ఆ స్థానంలో అతని ఆరంభం ఆశించిన విధంగా లేదు. అవకాశాలు వచ్చిన వినియోగించుకోలేకపోయాడు. వన్ డౌన్ లో వచ్చిన ప్లేయర్ ఎంతో ఓపికగా ఆడాలి. పిచ్ పరిస్థితులను వేగంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంటుంది'అని వసీం జాఫర్ సూచించాడు.
ఇక అజింక్యా రహానే రాణించడం కూడా చాలా ముఖ్యమని తెలిపాడు. అతను నిలకడగా రాణిస్తే.. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్గా ఎదిగే అవకాశం ఉందన్నాడు.
'రహానే దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అతను మరింత నిలకడగా రాణించాల్సిన సమయం ఇది. అతని కెరీర్లో నిలకడలేమి ప్రధాన సమస్యగా మారింది. అతను దానికి కచ్చితంగా అధిగమించాలి. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత టెస్ట్ల్లో టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశం అతనికే ఉంది.
అతనికి గతంలో కెప్టెన్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ను అతని సారథ్యంలోని భారత జట్టు ఏ విధంగా సొంతం చేసుకుందో మనందరికి తెలుసు. ప్రస్తుతం రోహిత్ తర్వాత కెప్టెన్గా అతనే సరైనోడు.'అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
గత సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమైన రహానే.. అనంతరం జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీలో సత్తా చాటడంతో పాటు కౌంటీల్లో రాణించి.. ఐపీఎల్లో మెరిసి మళ్లీ టీమిండియా పిలుపు అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ విండీస్ పర్యటనలో మాత్రం రెండు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.