ఐపీఎల్ 2024 సీజన్ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకుంది. ఈ పరాజయం నేపథ్యంలో ముంబై ఇండియన్స్ నయా సారథి హార్దిక్ పాండ్యా తీవ్ర ట్రోలింగ్కు గురవుతున్నాడు. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అతని కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించాయని సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి స్టార్ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

అయితే టీమిండియా మాజీ క్రికెటర్, రంజీ దిగ్గజం వసీం జాఫర్ మాత్రం హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. అతని కెప్టెన్సీ మరీ అంత చెత్తగా ఏం లేదని చెప్పాడు. కెప్టెన్గా అతను చేసిన తప్పిదం ఒకే ఒక్కటని, అది కూడా బ్యాటింగ్లో టీమ్ డేవిడ్ను ముందుకు పంపించడమని తెలిపాడు. ఇది మినహా హార్దిక్ పాండ్యా జట్టును అద్భుతంగా నడిపించాడని చెప్పాడు.
అందరూ విమర్శించేంత చెత్తగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లేదని తెలిపాడు. 'సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. తాను రాకుండా టీమ్ డేవిడ్ను బ్యాటింగ్ పంపించడం హార్దిక్ పాండ్యా చేసిన ఘోర తప్పిదం. ఈ ఒక్కటి మినహా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా జట్టును అద్భుతంగా నడిపించాడు.
బౌలింగ్లో కొత్త బంతిని లూక్ వుడ్కు ఎక్కువ ఇవ్వాల్సింది. హార్దిక్ పాండ్యా వేయకుండా అతనితో వేయించాల్సింది. అయినా మ్యాచ్ ముంబై చేతిలోనే ఉంది. బ్యాటింగ్లో చేసిన తప్పిదమే పరాజయానికి కారణమైంది.'అని వసీమ్ జాఫర్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు హార్దిక్ పాండ్యాను రోహిత్ శర్మ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. రోహిత్.. రోహిత్ అంటూ ఎగతాళి చేశారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ను చేయడం సహించని అభిమానులు.. అతను చేసే ప్రతీ పనిలో తప్పును వెతుకుతున్నారు.