న్యూఢిల్లీ: వెస్టిండీస్తో వన్డే సిరీస్లో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ కంటే సంజూ శాంసన్కే అవకాశం దక్కుతుందని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. ఇషాన్ కిషన్ టాపార్డర్ బ్యాటరే కావడమే దానికి ప్రధాన కారణమని వెల్లడించాడు. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ఇషాన్ కిషన్తో పాటు సంజూ శాంసన్ ఎంపికైన విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ గాయాలతో జట్టుకు దూరమైన నేపథ్యంలో ఈ ఇద్దరికీ అవకాశం దక్కింది. వెస్టిండీస్తో గురువారం తొలి వన్డే ప్రారంభం కానుంది. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ను టీమిండియా సన్నాహకంగా వాడుకోనుంది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లో ఎవరు రాణిస్తే వారికే ఆసియాకప్లో అవకాశం దక్కుతుందని వసీం జాఫర్ అన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాట్తో రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. అతని 6వ స్థానంలో బ్యాటింగ్కు పంపిస్తే జట్టుకు మేలు జరుగుతుందని సూచించాడు. 'వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ల సత్తాకు పరీక్ష. వన్డే ప్రపంచకప్ ప్రారంభమయ్యేవరకు ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది.
వెస్టిండీస్తో సిరీస్లో సంజూ శాంసన్కే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ టాపార్డర్ బ్యాటర్. అప్ది ఆర్డర్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. కాబట్టి ఇషాన్ కిషన్ను పక్కనపెట్టి సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వనున్నారు. ఎవరైతే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వారికి జట్టులో చోటు సుస్థిరం కానుంది.

నా అభిప్రాయం ప్రకారం సూర్యకుమార్ యాదవ్ను నెంబర్ 5 లేదా నెంబర్ 6లో ఆడించాలి. నేను అయితే అతని ఆరో స్థానంలో బరిలోకి దించేవాడిని. ఎందుకంటే అతను టీ20 క్రికెట్ ఎలా ఆడుతాడో అందరికి తెలుసు. చివర్లో పంపిస్తే అతనికి తక్కువ ఓవర్లే అందుబాటులో ఉంటాయి. అప్పుడు టీ20ల్లోలా ధనాధన్ ఆటతో చెలరేగగలడు.
నెంబర్ 4లో ఆడిస్తే చాలా ఓవర్లు ఉండి తన శైలికి భిన్నంగా ఆడాల్సి వస్తుంది. కాబట్టి నెంబర్ 5లో ఆడించడమే ఉత్తమం.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్తో తొలి వన్డే మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.