
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను చూస్తుంటే బాధేస్తుందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ వరకు ఓపెనర్ల లిస్ట్లో ముందు వరుసలో ఉన్నాడని, కానీ ఇప్పుడు వెనుకంజలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఈ విషయంలో అతని తప్పులేకపోయినా పరిస్థితులు అలా మారాయని తెలిపాడు.
బంగ్లాదేశ్తో చివరి వన్డేలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ కూడా 72వ సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇషాన్ కిషన్ ద్విశతకంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేట్టుగానే కనపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వసీం జాఫర్ శుభ్మన్ గిల్ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఇటీవల మ్యాచ్లో తన ప్రదర్శనతో శుభ్మన్ గిల్ కన్నా ఇషాన్ ఉత్తమ ఎంపికగా మారాడు. గిల్ విషయంలో నాకు కాస్త బాధగా ఉంది. ఎందుకంటే, ఈ ఇన్నింగ్స్కు ముందు ఓపెనర్ల లిస్టులో అతను ముందు వరుసలో ఉన్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తర్వాత వరుసగా మూడో స్థానంలో ఉన్నవాడు.. ఇషాన్ కిషన్ ఎంట్రీతో నాలుగో స్థానంలోకి పడిపోయాడు. అతని తప్పేమీ లేకపోయినా గిల్కు జట్టులో స్థానం దక్కకపోవడం బాధగా అనిపిస్తుంటుంది' అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

శిఖర్ ధావన్ ఫామ్ గురించి మాట్లాడుతూ..'న్యూజిలాండ్తో సిరీస్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. కొంత కాలంగా ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం, కొందరు మధ్యలోనే నిష్క్రమించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శిఖర్ ధావన్ ఫామ్ కోల్పోతే టీమ్మేనేజ్మెంట్ను మరింత అయోమయానికి గురిచేస్తుంది. ఇటీవల పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ అతను మరోసారి సత్తా చాటాలని సెలక్టర్లు భావిస్తుండవచ్చు.'అని పేర్కొన్నాడు.