
కరాచీ: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఓటమికి హసన్ అలీనే కారణమంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తప్పుబట్టాడు. ఈ కష్ట సమయంలో జట్టుకు అండగా ఉండాలే తప్పా అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడవద్దని అభిమానులను కోరాడు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే విజయం ఖాయం అనుకున్న సమయంలో మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హసన్ అలీ వదిలేసాడు. ఆ అవకాశాన్ని అందుకున్న అతను హ్యాట్రిక్ సిక్స్లు బాది పాక్ పతనాన్ని శాసించాడు.
క్యాచ్ నేలపాలు చేసిన హసన్ అలీ విలన్ అయ్యాడు.ఆ క్యాచ్ పట్టుకొని ఉంటే.. పాక్ మ్యాచ్ గెలిచేదని, బంతిని వదిలేసి తప్పు చేశాడంటూ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్పై స్పందిస్తూ హసన్ అలీ తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే వసీమ్ అక్రమ్ సైతం హసన్ అలీకి అండగా నిలిచాడు. 'పాకిస్థాన్ జట్టు ఓటమికి అటు క్రికెటర్లకు, ఇటు అభిమానులకు కష్టతరమైందే. ఆట ముగియగానే.. నిరాశతో ఆటగాళ్లంతా వారి గదుల్లోకి వెళ్లి బాధపడతారు.
ఎవరితోనూ మాట్లాడరు. మ్యాచ్ ఓటమి వారిని వెంటాడుతుంటుంది. అలాంటప్పుడు దేశ ప్రజలమైన మనం.. అగ్నికి ఆజ్యం పోసినట్లు వారిని బాధపెట్టకూడదు. ఇప్పుడు ప్రజలంతా హసన్ అలీని నిందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నేను, వకార్ యునీస్ చాలా సార్లు ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లో అయితే, ఇది కేవలం ఒక ఆట మాత్రంగానే పరగణిస్తారు. మరుసటి రోజు బాగా ప్రయత్నించారు.. ఇది దురదృష్టకరం అని ఊరుకుంటారు. కానీ భారత్, పాక్ వంటి దేశాల్లో ఓటమిని ఏ మాత్రం సహించరు''అని వసీమ్ అక్రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.