
కరాచీ: వన్డే క్రికెట్ ప్రభావం తగ్గిందని, అంతర్జాతీయ షెడ్యూల్లోనూ మ్యాచ్ల సంఖ్య తగ్గించాలని క్రికెట్ బోర్డులకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సూచించాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఫార్మాట్ మనుగడపై చర్చకు తెరలేచింది. వన్డేలను తగ్గించి టీ20లు, టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్పై కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. బెన్స్టోక్స్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచిన అక్రమ్.. టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలసటకు గురవుతున్నారని తెలిపాడు.
'బెన్స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే కానీ.. అతని నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నా. ప్రస్తుత సమయంలో వన్డే క్రికెట్ వేగంగా ప్రాభవం కోల్పోతోందని మాత్రం ఓ వ్యాఖ్యాతగా చెప్పగలను. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్ పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందుతోంది. 50 ఓవర్లపాటు ఆడాలని ఏ ఆటగాడూ కోరుకోవడం లేదు. టీ20లు అలా కాదు. నాలుగే గంటల్లో మ్యాచ్ పూర్తి అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లు వచ్చేశాయి. భారీ మొత్తంలో సంపాదన లభిస్తోంది.
అంతేకాకుండా, వన్డే క్రికెట్ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలసటకు గురవుతున్నారు. అందుకే టీ20లు ఆడటం సులువు. టీ20 క్రికెట్ లేదా.. టెస్టు ఫార్మాట్ అడేందుకు మాత్రమే ప్లేయర్లు ఆసక్తి చూపుతున్నారు. వన్డే క్రికెట్ అంతరించే స్థాయికి చేరుకుంది'' అని వసీం అక్రమ్ తెలిపాడు. స్వతహాగ తనకు టెస్టు ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన అక్రమ్... టెస్టుల వల్లే ఆటగాడి సామర్థ్యం వెలుగులోకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో కూడా రాణిస్తేనే గొప్ప ప్లేయర్లుగా గుర్తింపు లభిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వసీం అక్రమ్ సూచించాడు.