
న్యూఢిల్లీ: తన భార్య చనిపోయినప్పుడు భారత అధికారులు అందించిన సహకారాన్ని మరిచిపోలేనని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. మానవతా ధృక్పథంతో వారు స్పందించిన తీరు ఎప్పటికీ గుర్తు ఉంటుందని తెలిపాడు. వసీం అక్రమ్ సతీమణి హుమా అక్రమ్ 2009లో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తన భార్యకు మెరుగైన చికిత్స అందించేందుకు వసీం అక్రమ్ ఆమెను తీసుకొని సింగపూర్కు బయల్దేరాడు. ఇంధనం నింపుకోవడం కోసం వసీం ప్రయాణిస్తున్న విమానం చెన్నై విమానాశ్రయంలో ఆగింది.
ఆ సమయంలోనే హుమా పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి వెళ్లింది. దాంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వసీం అక్రమ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన దగ్గర భారత వీసా లేకపోవడంతో.. ఏం చేయాలో అర్థంకాక ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో చెన్నై ఎయిర్పోర్టులోని కొందరు, సెక్యూరిటీ అధికారులు, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ్ను గుర్తుపట్టి సాయం చేశారు. వీసా గురించి బాధపడకండని, వసీం భార్యను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వసీం భార్య మరణించింది. ఆ సమయంలో భారత అధికారులు చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోనని వసీం.. తన బయోగ్రఫీ 'సుల్తాన్: ఏ మొమోయర్'లో ప్రస్తావించాడు. తాజాగా ఈ బుక్ గురించి స్టార్ స్పోర్ట్స్ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
1999లో భారత్-పాక్ మధ్య చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ను కూడా అక్రమ్ గుర్తు చేసుకున్నాడు. ఆ చెన్నై టెస్టు తనకెంతో ప్రత్యేకమని అక్రమ్ తెలిపాడు. చెన్నై వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, అక్కడి పిచ్, పరిస్థితులు రివర్స్ స్వింగ్కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. సక్లయిన్ ముస్తాక్ రూపంలో అత్యుత్తమ స్పిన్నర్ తమ జట్టులో ఉన్నాడని, ఆ సమయంలోనే అతను దూస్రా బంతిని కనిపెట్టాడని గుర్తు చేసుకున్నాడు. సక్లయిన్ దూస్రాను ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాకపోయేదన్న అక్రమ్... సచిన్ టెండూల్కర్ ఒక్కడే మెరుగ్గా ఆడాడని తెలిపాడు. వికెట్ కీపర్ మీదుగా లాప్ షాట్ ఆడేవాడని గుర్తు చేసుకున్నాడు. అందుకే సచిన్ ఆల్టైమ్ గ్రేట్గా నిలిచాడని కొనియాడాడు.