పాకిస్థాన్ స్టార్ సీనియర్ ఆటగాళ్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు మాట్లాడుకోరని, మరో ఇద్దరికి ఎలా ఆడాలో కూడా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం కారణంగానే పాకిస్థాన్కు ఘోర పరాజయం ఎదురైందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ విధించిన 120 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ చేధించలేకపోయింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) మినహా అంతా విఫలమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన వసీం అక్రమ్ పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. గేమ్పై మహమ్మద్ రిజ్వాన్కు అవగాహన లేదని, ఇఫ్తికర్కు బ్యాటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదని మండిపడ్డాడు. మరో ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు(బాబర్ ఆజామ్, షాహిన్ షా అఫ్రిది) మాట్లాడుకోరని, జట్టు మొత్తం మార్చేయాలని అసహనం వ్యక్తం చేశాడు.
'పాకిస్థాన్ ఆటగాళ్లు గత 10 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నారు. వారికి కొత్తగా నేను ఏం నేర్పించలేను. మహమ్మద్ రిజ్వాన్కు గేమ్పై ఏ మాత్రం అవగాహన లేదు. బుమ్రా వికెట్ టేకింగ్ బాల్స్ వేస్తాడని, అతని బౌలింగ్ను జాగ్రత్తగా ఆడాలనే సోయి లేదు. దాంతో బుమ్రా బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు.
కొన్నేళ్లుగా పాకిస్థాన్కు ఆడుతున్నా.. ఇఫ్తికర్ అహ్మద్కు ఎలా బ్యాటింగ్ చేయాలో కూడా తెలియదు. అతనికి తెలిసింది ఒకే ఒక్క లెగ్ సైడ్ షాట్ మాత్రమే. ఫకార్ జమాన్ గేమ్ అవగాహన గురించి నేను చెప్పలేను. పాక్ ఆటగాళ్లకు ఏ మాత్రం భయం లేకుండా పోయింది. తాము ఆడకుంటే కోచ్లను మారుస్తారు. మాకు ఏం కాదు అనే ధైర్యంతో ఉన్నారు. ఈ సారి కోచ్లను కాకుండా టీమ్ మొత్తాన్ని మార్చేయాలి.
జట్టులోని కొందరు ఆటగాళ్లు అయితే ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. ఇది అంతర్జాతీయ క్రికెట్. ఓ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇలా ఒకరికొకరు మాట్లాడుకోని ఆటగాళ్లను ఇంట్లో కూర్చోపెట్టాలి.'అని వసీం అక్రమ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.