ఈ తరం టీ20 క్రికెట్లో నెమ్మదిగా ఆడే రోజులు పోయాయని, ఎదుర్కొన్న తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్ వస్తున్న విమర్శలపై వసీం అక్రమ్ తనదైన శైలిలో స్పందించాడు. స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీని విమర్శించడం సరికాదన్నాడు.
అయితే ఆర్సీబీ పరాజయాల నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ చర్చనీయాంశం అవుతుందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 'ఆర్సీబీ ఓడిపోవడంతోనే విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్పై విమర్శలు వస్తున్నాయి. జట్టు గెలిచినప్పుడు 100, 150 స్ట్రైక్రేట్తో ఆడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఓడితే మాత్రం భూతద్దంలో పెట్టి చూస్తూ విమర్శలు గుప్పిస్తారు.

ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒత్తిడినే ఎదుర్కొంటున్నాడు. అతను పరుగులు చేస్తున్నా.. ఇతరులు రాణించడం లేదు. అయితే ఒక్కడే మ్యాచ్లు గెలిపించ లేడు. అయితే విరాట్ కోహ్లీని విమర్శించడం సరికాదు. ఇది ఏమాత్రం అమోదయోగ్యం కాదు. కోహ్లీ చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది.
16 ఏళ్ల అయిన తర్వాత కూడా నిలకడగా రాణించలేకపోతున్న ఆర్సీబీ తమ ప్రదర్శనపై పునరాలోచన చేయాల్సి ఉంది. బ్యాటింగ్ బాగానే ఉన్నా.. బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. కొందరు చిన్నస్వామి స్టేడియం చిన్నగా ఉందని చెబుతున్నారు. కానీ ఆ స్టేడియం చిన్నదనే విషయం ముందే తెలుసు కదా..? ఆ మైదానానికి తగ్గట్లు ఆటగాళ్లను తీసుకోవాలి కదా..? నేను 1987లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఆ మైదానం అలానే ఉంది. ఎలాంటి మార్పులు జరగలేదు.
టీ20 క్రికెట్లో యాంకర్ రోల్ అనేదానికి చోటు లేకుండా పోయింది. జట్లన్నీ 270 పరుగుల భారీ స్కోర్లు చేస్తున్న పరిస్థితుల్లో 150 స్ట్రైక్రేట్తో ఆడుతున్నా.. నెమ్మదిగానే అనిపిస్తోంది. పిచ్లు, బ్యాటింగ్ ప్రదర్శనలు చూస్తుంటే.. ఎదుర్కొన్న తొలి బంతి నుంచి హిట్టింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.'అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు.