అడిలైడ్: ఆసియాకప్ 2022లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విలువైన క్యాచ్ను వదిలేసిన అర్ష్దీప్ సింగ్ను భారత అభిమానులు ఘోరంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. జుగుప్సాకరమైన ట్రోలింగ్తో యువ ఆటగాడిపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో జట్టు అతనికి మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో మాత్రం ఈ లెఫ్ట్ హ్యాండర్ పేసర్ ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ ఈ యువ ఆటగాడిపై ప్రశంసలు జల్లు కురిపించాడు.
'అర్ష్దీప్ సింగ్ ప్రతిభను నేను, వకార్ యూనిస్ ఆసియా కప్ సమయంలోనే గుర్తించాం. సూపర్ 12 దశలో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా అర్ష్దీప్ ఈ టోర్నమెంట్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితో అతడు రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ఐపీఎల్ 2022 సీజన్లోనూ గొప్పగా ఆడాడని అంతా చెప్తున్నారు. ఈ యువ బౌలర్కు మంచి భవిష్యత్తు ఉంది. అతడెంతో తెలివైనవాడు. బంగ్లాతో మ్యాచ్లో అతడు వేసిన యార్కర్లు ఆట గమనాన్ని మలుపుతిప్పాయి.
భారత్లో ఈ ఆటగాడిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేశారు. కానీ అతను ఇవేవీ పట్టించుకోలేదు. ఆటగాడికి కచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఇది'' అంటూ వసీం తెలిపాడు. బుమ్రా లోటును భర్తీ చేస్తూ జట్టులోకి అడుగుపెట్టిన ఈ ఫాస్ట్ బౌలర్ ప్రపంచ జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా హార్డ్, బౌన్సీ పిచ్లపై ముందుగానే ప్రాక్టీస్ చేసి సన్నద్ధంగా ఉండటం వల్లే మంచి ఫలితాలు రాబడుతున్నానని అర్ష్దీప్ పేర్కొన్నాడు.