కరాచీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో టీమిండియాకు అతనే ప్రధాన ఆయుధమని తెలిపాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2023లో హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు. బంతితో, బ్యాటుతో రాణించి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.
పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ విఫలమైన వేళ ఇషాన్ కిషన్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో 90 బంతుల్లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో నిలకడగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా.. ప్రపంచకప్లోనూ సత్తా చాటుతాడని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.

'అప్కమింగ్ వన్డే ప్రపంచ కప్లో హార్దిక్ పాండ్యా టీమిండియా ప్రధాన ఆయుధం. ఈ టోర్నీ టైటిల్ ఫేవరెట్లలో టీమిండియా ఒకటి. వారి సొంతగడ్డపై ఈ టోర్నీ జరుగుతుండటం కలిసొచ్చే అంశం. ఆసియా కప్ ఫైనల్లో భారత్ బౌలింగ్ సత్తా ఏంటో చూశాం. ఆసియా కప్లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పెద్ద జట్లపై కూడా వికెట్లు పడగొట్టాడు'అని వసీమ్ అక్రమ్ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ 2023లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 8వ సారి టైటిల్ను ముద్దాడింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్), శుభ్మన్ గిల్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్) రాణించారు.