
కరాచీ: తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి దాదాపు 17 ఏళ్లు కావొస్తుందని, అయినా తనపై మిమర్శలు చేస్తున్నారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని మండిపడ్డాడు. ఈ విమర్శలు తనను డిఫ్రెషన్లోకి నెడుతున్నాయని తెలిపాడు.
1992 వరల్డ్కప్ తర్వాత పాకిస్థాన్ మరో ప్రపంచకప్ గెలవకపోవడానికి వసీం అక్రమ్ కెప్టెన్సీ వైఫల్యమే కారణమని పాక్ మాజీ టెస్ట్ ఓపెనర్ అమిర్ సొహైల్ ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. 'పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో వరల్డ్కప్ రాకుండా చేయడమే అప్పట్లో అక్రమ్కున్న ప్రధాన లక్ష్యం. అక్రమ్కు దేశం పట్ల అంకితభావం ఉంటే పాక్ 1996, 1999, 2003 వరల్డ్కప్లు నెగ్గేది. ఒక కారణంతో ఈ నాటకమంతా జరిగింది. 1995లో పాక్కు రమీజ్ రాజా కెప్టెన్గా ఉన్నాడు. అంతకుముందు సలీమ్ మాలిక్ పాక్కు సారథ్యం వహించాడు.
కెప్టెన్గా ఎంతో విజయవంతమైన మాలిక్ను కొనసాగించివుంటే అసలు అక్రమ్ కెప్టెన్ అయ్యేవాడేకాదు. మూడు వరల్డ్కప్లకు కొంతకాలం ముందు మాత్రమే అక్రమ్ కెప్టెన్ అయ్యేవాడు. ఎందుకంటే పాక్కు మరో వరల్డ్కప్ ఉండకూడదనే ఉద్దేశంతోనే. పాక్కు వరల్డ్కప్కు సాధించిన ఘనత తన గురువు (ఇమ్రాన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ)మాత్రమే ఉండాలనే కారణం. దీనిపై విచారణ జరిపించాలి' అని ఈ పాక్ మాజీ ఓపెనర్ డిమాండ్ చేశాడు. దీనిపై స్పందించిన వసీం అక్రమ్.. ఈ వ్యాఖ్యలు తనను నైరాష్యంలోకి నెడుతున్నాయన్నాడు.
'నాపై వస్తున్న ఈ తరహా వ్యతిరేక వార్తలు నన్ను డిప్రెషన్లోకి నెడుతున్నాయి. 17 ఏళ్ల క్రితమే నేను ఆటకు గుడ్బై చెప్పా. కానీ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కొందరూ ఇలా నాపై విమర్శలు గుప్పిస్తున్నారు'అని అక్రమ్ తెలిపినట్లు పాకిస్థాన్ జర్నలిస్ట్ సాజ్ సాధిక్ ట్వీట్ చేశారు.