ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తన అక్కసు వెల్లగక్కాడు. ఐపీఎల్ ముగిసేలోపు ఓ పిల్లాడు పుట్టి పెద్దవాడవుతాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎక్కువ రోజులు జరగడం వల్ల ఐపీఎల్లో నాణ్యత కొరవడుతుందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2026 సీజన్ ప్రమోషన్స్లో భాగంగా లండన్ వేదికగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్వహించిన కార్యక్రమానికి వసీం అక్రమ్ హాజరయ్యాడు.
పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ, బాబర్ ఆజామ్, హారిస్ రౌఫ్లు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన వసీం అక్రమ్.. పీఎస్ఎల్ను ఐపీఎల్తో పోల్చాడు. ఐపీఎల్ ఎక్కువ రోజుల పాటు జరుగుతుండటంతో బోరింగ్గా మారిందన్నాడు. 'పుట్టిన పిల్లవాడు కూడా పెద్దవాడవుతాడు. కానీ ఐపీఎల్ మాత్రం ముగియదు. మా పీఎస్ఎల్ అలా కాదు. 34-35 రోజుల్లోనే పూర్తవుతుంది. బహుషా వచ్చే ఏడాది మరికొన్ని రోజులు పెరగవచ్చు. విదేశీ ఆటగాళ్లకు ఇతర దేశాల్లో 34-35 రోజులు ఉండటం పెద్ద సమస్య కాదు. కానీ ఒక టోర్నీ కోసం 3 నెలల పాటు ఉండటమే కష్టం.

ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్ వ్యవధిని కూడా తగ్గించారు. వ్యవధి పరంగానే కాకుండా బౌలింగ్ నాణ్యత పరంగా కూడా పీఎస్ఎల్.. ఐపీఎల్ కంటే మెరుగ్గా ఉంది. నేను తరుచుగా విదేశీ ఆటగాళ్లతో మాట్లాడినప్పుడు పీఎస్ఎల్ బౌలింగ్ నాణ్యతను ప్రశంసిస్తారు. ఐపీఎల్, ఇతర లీగ్ల కంటే నాణ్యత పరంగా పీఎస్ఎల్ నెంబర్ వన్ అంటున్నారు.'అని ఐపీఎల్ బౌలింగ్ను విమర్శించాడు.
అయితే ప్రపంచ నెంబర్ వన్ క్రికెట్ లీగ్ మాత్రం ఐపీఎల్ అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత పీఎస్ఎల్ రెండో స్థానంలో ఉందని చెప్పాడు. బాబర్ ఆజాం, పీసీబీ ఛైర్మన్ సమక్షంలో ఐపీఎల్ గురించి వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వసీం అక్రమ్పై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. ఐపీఎల్ ముంగిట పీఎస్ఎల్ జుజుబీ అని కామెంట్ చేస్తున్నారు.