|
రెహమాన్తో సుందర్
ఏఆర్ రెహమాన్ను కలిసిన సందర్భంగా తీసుకున్న పోటోలను వాషింగ్టన్ సుందర్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'నేను ఎంతో ఇష్టపడే ఏఆర్ రెహమాన్ను స్వయంగా కలిశాను. ఇది నిజంగా ఆహ్లదకరమైన సాయంత్రం' అంటూ సుందర్ క్యాప్షన్ జత చేశాడు. రెహమాన్ను సుందర్ కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. తాజాగా రెహమాన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలోని ప్రతిభావంతులను వెలికితీసేందుకు 'ఫ్యూచర్ ఫ్రూఫ్' పేరుతో ఓ కాన్ఫరెన్స్ వెబ్ సిరీస్ను రూపొందించనున్నారు.
84 పరుగులు, నాలుగు వికెట్లు
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో సుందర్ 62 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేసి నాలుగో టెస్టులో భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బౌలింగ్లోనూ 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో 84 పరుగులు, నాలుగు వికెట్లు తీశాడు. సుందర్ టీమిండియా తరపున ఇప్పటివరకు ఒక వన్డే, ఒక టెస్టు మ్యాచ్తో పాటు 21 టీ20లు ఆడాడు.
'డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఐకాన్'గా సుందర్
ఆస్ట్రేలియా టూర్ని ముగించుకుని చెన్నైకి వచ్చిన వాషింగ్టన్ సుందర్కి ఘన స్వాగతం లభించింది. ఆ వెంటనే సుందర్ని చెన్నై 'డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఐకాన్'గా చెన్నై కార్పొరేషన్ నియమించింది. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ.. యువత పోలింగ్ శాతాన్ని పెంచేందుకే సుందర్ని ఐకాన్గా నియమించినట్లు చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమీషనర్ మేఘనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఏఆర్ రెహ్మాన్ కలిసిన సుందర్.. ఆనందంలో తెలియాడుతున్నాడు.
వారం చివరలో జట్టుతో చేరనున్న సుందర్
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి రెండు టెస్టులకి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈరోజు చెన్నైకి చేరుకున్న ఇంగ్లాండ్ టీమ్ ఆరు రోజులు క్వారంటైన్లోకి వెళ్లింది. ఇక భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, శార్ధూల్ ఠాకూర్, అజింక్య రహానే తదితరులు చెన్నైకి వచ్చారు. అయితే వాషింగ్టన్ సుందర్ మాత్రం ఈ వారం చివరలో భారత్ జట్టుతో చేరనున్నాడు. రాష్ట్రం దాటాల్సిన అవసరం లేకపోవడంతో.. తమిళనాడుకి చెందిన ఆటగాళ్లకి ఆలస్యంగా జట్టుతో చేరే వెసులబాటుని బీసీసీఐ కల్పించింది.