అసలు విషయం ఏంటంటే..?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతిని క్రీజులో ఉన్న డేవిడ్ మలన్ స్ట్రైయిట్ షాట్ ఆడగా.. బంతి నాన్ స్ట్రైకర్ వైపు దూసుకెళ్లింది. అయితే బెయిర్ స్టో అప్పటికే క్రీజు నుంచి బయటకు రావడంతో సుందర్కు క్యాచ్ పట్టే అవకాశం లేకుండా పోయింది. బంతిని అందుకునే క్రమంలో సుందర్ బెయిర్ స్టోపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బంతి బెయిర్ స్టో హెల్మెట్కు తాకి పక్కకు వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుందర్ బెయిర్ స్టోపై గట్టిగా అరిచాడు.

బెయిర్ స్టో కూడా..
క్యాచ్ పట్టకుండా జానీ బెయిర్స్టో అడ్డుపడ్డాడని ఆరోపించిన వాషింగ్టన్ సుందర్.. మైదానంలోనే అతనితో గొడవకి దిగాడు. దాంతో.. బెయిర్స్టో కూడా వాదించడం మొదలెట్టాడు. ఇద్దరు క్రికెటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని సర్దిచెపే ప్రయత్నం చేశాడు. ఓవర్ ముగియడంతో అదే సమయంలో అక్కడికి వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా.. సుందర్ని వెనక్కి తగ్గాలని సూచించడంతో వాగ్వాదం ముగిసింది. సిల్లీ మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ఆ వాగ్వాదాన్ని సైలెంట్గా చూస్తుండిపోయాడు

సారీ చెప్పిన సుందర్..
అనంతరం వాస్తవం తెలుసుకున్న సుందర్.. తన మరుసటి ఓవర్ టైమ్లో బెయిర్ స్టోకు క్షమాపణలు చెప్పాడు. దాంతో అతను సుందర్ భుజంపై చేయి వేస్తూ పర్లేదంటూ.. ఆటలో ఇదంతా కామన్ అంటూ వెన్ను తట్టాడు. అయితే ఈఇద్దరి మధ్య జరిగిన హాట్ హాట్ సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జాసన్ రాయ్ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) ఇదే వేదికలో జరగనుంది.


Click it and Unblock the Notifications












