
న్యూఢిల్లీ: మాజీ కికెటర్లు గౌతమ్ గంభీర్, షాహిద్ అఫ్రిది సామాజిక మాధ్యమాల వేదికగా తమ మాటల యుద్దాన్ని ఆపేస్తే మంచిదని పాక్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ సూచించాడు. సోషల్ మీడియాలో కాస్త విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలని ఆకాంక్షించారు.
అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో ఏండ్లు జట్టుకు సేవలందించిన ఇలాంటి ఆటగాళ్లు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు తిట్టుకోవడం సరైంది కాదన్నాడు. ప్రపంచమంతా గమనిస్తున్న వేళ.. కాస్త జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
'చాన్నాళ్లుగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. దాన్ని ఏదో ఒక స్థాయిలో ఆపేయాల్సిన అవసరం ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఇలా సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదానికి దిగడం మంచిది కాదు. ఇద్దరూ సంయమనం పాటిస్తూ.. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరుగడం లేదు.

దీనిపై ఇరుదేశాల క్రీడాభిమానులను ప్రశ్నిస్తే.. అందులో 95 శాతం మంది భారత్, పాక్ ఆడితే చూడాలనుకుంటున్నామనే సమాధానమిస్తారు. దానికి 'ఇమ్రాన్-కపిల్' సిరీస్ లేదా ఇండిపెండెన్స్ సిరీస్ అని పేరు పెడితే బాగుంటుంది. యావత్ క్రికెట్ ప్రపంచంలోనే ఈ సిరీస్ సూపర్ హిట్ అవుతుంది.' అని వకార్ చెప్పుకొచ్చాడు.
సమీప భవిష్యత్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, భారత్, పాక్ల మధ్య 2013 జనవరి తర్వాత నుంచి ద్వైపాక్షిక సీరిస్ జరగని సంగతి తెలిసిందే. ఇక, గంభీర్, ఆఫ్రిదిల మధ్య ఎప్పుడూ ఏదో అంశంపై సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల పీవోకేకు సంబంధించి ఆఫ్రిది చేసిన వివాదస్పద వ్యాఖ్యలను గంభీర్ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తనదైన శైలిలో వ్యంగ్యాస్రాలు సంధించారు.