
2 కాదు 3 జట్లు ఒకేసారి..
'టీమిండియా ప్రతిభకు నిదర్శనం. రెండు కాదు.. ఏక కాలంలో మూడు జట్లను అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడించగల దమ్ము భారత క్రికెట్ సొంతం. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభకు కొదవలేదు. దేశవాళీ క్రికెట్ వ్యవస్థ.. భారత్-ఎ జట్ల పర్యటనలు.. ఐపీఎల్.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీల మార్గనిర్దేశం ఈ ఘనతకు కారణం.
భారత దేశవాళీ క్రికెట్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. పటిష్టమైన రిజర్వ్ బెంచ్కు అదే కారణం. ఐపీఎల్ కూడా కీలకపాత్ర పోషించింది. పేరుకు టీ20 ఫార్మాట్ అయినా ప్రతిభావంతులు వెలుగులోకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మిగతా జట్ల కంటే టీమిండియా చాలా ముందుంది.'అని ఈ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మెన్ చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్ సరైనోడు..
శ్రీలంక పర్యటనకు ద్రవిడ్ను కోచ్గా పంపడం సరైన నిర్ణయమని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. భారత్-ఏ కోచ్గా, ఎన్సీఏ డైరెక్టర్గా ద్రవిడ్కు ఆటగాళ్లపై అవగాహన ఉందన్నాడు. 'శ్రీలంకకు వెళ్లే జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మంది భారత్-ఎ తరఫున ఆడారు. ఇండియా-ఏ జట్టు కోచ్గా, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా రాహుల్ ద్రవిడ్కు వాళ్లపై మంచి అవగాహన ఉంది.
ఎన్సీఏకు ఎప్పుడు వెళ్లినా వారికి సహాయం అందించేవాడు. ప్రస్తుతం టీమిండియాతో కోచ్ రవిశాస్త్రి తీరిక లేకుండా ఉన్నాడు కాబట్టి కోచ్గా ద్రవిడ్ ఎంపిక సరైనదే. ద్రవిడ్ అనుభవం టీమిండియాకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. అతని మార్గనిర్దేశం ఆటగాళ్లకు పనికొస్తుంది.'అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

కోహ్లీసేననే ఫేవరేట్..
ఇక న్యూజిలాండ్తో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భారతే ఫేవరెట్ అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. 'గత రెండేళ్లలో సొంతగడ్డపై.. విదేశాల్లో టీమిండియా ఆధిపత్యం కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్లో టీమిండియాకు తిరుగులేదు. బలమైన రిజర్వ్ బెంచ్ కూడా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనే ఇందుకు నిదర్శనం. కోహ్లి చివరి మూడు టెస్టుల్లో ఆడకపోయినా.. సీనియర్లు లేకపోయినా.. తొలి టెస్టు ఓడిన తర్వాత కూడా టీమిండియా అద్భుతంగా పుంజుకుని సిరీస్ గెలుచుకుంది.
అవకాశం లభిస్తే సత్తాచాటేందుకు జట్టులో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. డబ్ట్యూటీసీ ఫైనల్లో విరాట్ సేననే ఫేవరెట్. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో రెండు టెస్టులాడటం కివీస్కు కలిసొచ్చేదే. మన వాళ్లకు ప్రాక్టీస్ లేకపోవడం ప్రతికూలత.

ఆ ఒక్కటి మినహా..
కివీస్ ప్రధాన బలం బౌలింగే. ఆ జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. ఇంగ్లండ్ పరిస్థితులు వారికి సరిగ్గా సరిపోతాయి. అయితే రెండేళ్ల డబ్ల్యూటీసీ క్యాలెండర్లో కివీస్ 70 నుంచి 80 శాతం మ్యాచ్లు సొంతగడ్డపై ఆడింది. టీమిండియా మాత్రం ఇంటా.. బయటా సత్తాచాటింది. విదేశాల్లో కివీస్ కంటే ఎక్కువ మ్యాచ్లాడింది.
బౌలింగ్లోనూ మంచి వనరులు భారత్ సొంతం. ఇషాంత్ అనుభవం.. బుమ్రా, షమీల పేస్ కలిసొచ్చేవే. సిరాజ్ ఉండనే ఉన్నాడు. అశ్విన్, జడేజాల రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు కలిగి ఉండటం భారత్కు పెద్ద సానుకూలాంశం. బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గట్లు ఆడితే భారత్కు విజయం ఖాయం'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












