WTC Final 2021: 'ఐసీసీ నిబంధనలు సరిగాలేవు.. ఛాంపియన్షిప్ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలి'

సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగుతున్న ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులపై క్రికెట్ మాజీలతో పాటు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఇప్పటికే తమ అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ చేరారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలు సరిగ్గా లేవని లక్ష్మణ్ అన్నారు. ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతున్న తీరు అభిమానులను నిరాశ పరిచిందన్నారు. ఛాంపియన్షిప్ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలని లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఇప్పటిదాకా 141.1 ఓవర్లు మాత్రమే
డబ్ల్యూటీసీ ఫైనల్లోని నాలుగు రోజుల ఆటలో కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే ఆట సాగింది. ఇప్పటిదాకా ఆట జరిగిన ఓవర్లు 141.1 మాత్రమే. ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే పూర్తయింది. మరో ఇన్నింగ్స్ ఆరంభ దశలోనే ఉంది. ఇంతలోనే భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో నాలుగు రోజులు గడిచిపోయాయి.
రిజర్వ్ డే కలుపుకొన్నా.. ఇక మిగిలింది రెండు రోజులే. ఈ రెండు రోజుల్లో మ్యాచ్లో ఫలితం వస్తే అద్భుతమే అనుకోవాలి. కానీ అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈరోజు కూడా ఆట పూర్తిగా జరుగుతుందో చెప్పలేం. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఐసీసీ బంధనలు సరిగాలేవు
నాలుగో రోజు ఆట రద్దు కావడంతో వీవీఎస్ లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... 'డబ్ల్యూటీసీ ఆట తీరుతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐసీసీ నియమాలు సరిగ్గా లేవని నాకనిపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా అంతిమంగా విజేత ఎవరో తేల్చాలి. సమయం చాలా ఉండటంతో రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదు రోజుల్లో 450 ఓవర్లు పూర్తవుతాయని భావించా.
ఐసీసీ నుంచి ఇదే ఆశించా. పైగా రిజర్వు డే ఉండటంతో ఎంతో ఉత్సాహంగా అనిపించింది. కానీ వర్షం ఇలాగే కురిస్తే.. రిజర్వు డేతో కలుపుకొనైనా మ్యాచును పూర్తి చేయగలరా అని సందేహం కలుగుతోంది' అని అన్నారు.

ఐసీసీ నిర్ణయం తీసుకోవాలి
తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'సౌథాంప్టన్లో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తొలిసారి నిర్వహిస్తున్న ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపిస్తోంది. దాంతో భారత్, కివీస్ ట్రోఫీని పంచుకునే అవకాశం ఉంది. ఐసీసీ ఫైనల్స్లో ఒక ట్రోఫీని ఇలా రెండు జట్లు పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది.
ఫుట్బాల్ ఆటలో విజేతను ప్రకటించాలంటే వాళ్లకు పెనాల్టీ షూట్ఔట్ లేదా మరో పద్ధతిని అవలంబిస్తారు. టెన్నిస్లో ఐదు సెట్లు నిర్వహిస్తారు. టై బ్రేకర్ కూడా ఉంటుంది. అలాగే ఛాంపియన్షిప్ ఫైనల్ డ్రాగా పూర్తయితే విజేతను ప్రకటించడానికి ఒక సూత్రాన్ని కనుగొనాలి. ఈ విషయంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి' అని సూచించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
WTC Final Draw:రిజర్వ్ డే కలుపుకున్నా.. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతను చూడడం కష్టమే!కోహ్లీకి నిరాశ తప్పదు!