
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్లో తనదైన యార్కర్లతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్.. బౌన్సర్లు, స్లో బాల్స్ కూడా వేయగలడని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అంతేకాకుండా అవకాశమిస్తే టీ20 ప్రపంచకప్లో అతను భారత్కు కీలక బౌలర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన నట్టూ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నట్టూపై వీవీఎస్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను పరిశీలిస్తే ఓ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అవసరం కనిపిస్తోంది. షమీ, సైనీ డెత్ ఓవర్లలో బాగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ లెఫ్టామ్ పేసర్ కావడంతో నటరాజన్ ప్రత్యేకంగా నిలుస్తాడు. నటరాజన్ అంటే అందరికీ యార్కర్లు గుర్తుకొస్తాయి.
కానీ అతను బౌన్సర్లు ఆఫ్ కట్టర్లు, స్లో బాల్స్ కూడా వేయగలడు. ఐపీఎల్లో అన్ని అస్త్రాలను బయటకు తీయలేదు. అయితే, యార్కర్ల విషయంలో నటరాజన్లో కాన్ఫిడెన్స్ అద్భుతం. ఐపీఎల్ ఆసాంతం దానిని ప్రూవ్ చేశాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఏబీ డివిలియర్స్ను ఔట్ చేసిన తీరే అందుకు నిదర్శనం'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో నటరాజన్ 8.02 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్ సాధ్యం కానీ విధంగా ఈ సీజన్లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే అతను యార్కర్ల నట్టూగా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 2లో కూడా చివరి ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేసి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. నట్టూ బౌలింగ్కు యువరాజ్ సింగ్, హర్షాబోగ్లే సైతం ఫిదా అయ్యారు.