
హైదరాబాద్: టీమిండియా యువ క్రికెటర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్పై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం యువకులకు సూర్య ఓ రోల్ మోడల్ అని కొనియాడాడు. భారత జట్టు ఎంపిక విషయంలో ఎన్నిసార్లు నిరాశ ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా రాణించాడని ప్రశంసించాడు. ఆ ఓపికే అతన్ని భారత జట్టుకు ఎంపికయ్యేలా చేసిందని ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ చెప్పుకొచ్చాడు.
'ఈ తరం యువకులకు సూర్య కుమార్ యాదవ్ ఒక రోల్ మోడల్. ప్రతిభ ఉన్నప్పటికీ.. భారత జట్టులో చోటు కోసం సుదీర్ఘ కాలం వేచి చూశాడు. చివరికి ఫలితం పొందాడు. ఇంతగా వేచి చూసే ఓపిక వేరొకరికి ఉండదేమో. టీమిండియాకు ఎంపిక కాకపోవడం వల్ల అతను నిరాశ చెందలేదు. తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున రాణించాడు.'అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.
సూర్య ఆడిన మ్యాచ్లు దాదాపు కఠిన పరిస్థితుల్లో ఆడినవేనని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ముంబైకి ఎన్నో సందర్భాల్లో విజయాలను అందించాడని తెలిపాడు. 'సెలెక్టర్లు నీకు మొండిచెయ్యి చూపిస్తే నీ ప్రదర్శనతోనే వారు ఎంపిక చేసేటట్లు నిరూపించుకోమని మా కోచ్ చెప్పేవారు. ఇప్పుడు సూర్య ఆటను చూస్తుంటే ఆ మాటలు గుర్తుకొస్తున్నాయి.
ఇంగ్లండ్తో టీ20లకు తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందో లేదో తెలీదు. కానీ అందుకు అతను పూర్తిగా అర్హుడు" అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఎన్నో రోజుల నుంచి ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా.. సూర్యకు భారత జట్టులో చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్ర దుమారం రేగింది. అయితే ఇంగ్లండ్తో టీ20లకు మాత్రం అతన్ని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కానీ తుది జట్టులో చోటు దక్కడంపై సందిగ్ధత నెలకొంది.