
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు మంచి భవిష్యత్తు ఉందని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అతని ఆటలో ఓ క్లారిటీ ఉందని ట్విటర్ వేదికగా కొనియాడాడు. బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో ఈ యువ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ మూడు ఫార్మాట్లలో అతనికి గొప్ప భవిష్యత్ ఉంటుందని ట్వీట్ చేశాడు.
'కెరీర్లో రెండో టెస్టు మ్యాచే ఆడుతున్నప్పటికీ సిడ్నీ పిచ్పై ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు చేస్తున్నాడు. చక్కని డిఫెన్స్, సానుకూల ధోరణీతో స్ట్రోక్ప్లే, షాట్ల ఎంపికపై స్పష్టత అతడి సొంతం. భారత్ తరఫున అన్నిఫార్మాట్లలో అతడికి కచ్చితంగా గొప్ప భవిష్యత్ ఉంటుంది'' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. బాక్సింగే టెస్టుతో గిల్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో 45, 35* పరుగులు చేశాడు. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకంతో రోహిత్ (26)తో కలిసి తొలి వికెట్కు 70 పరుగులు జోడించాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 96/2తో నిలిచింది. క్రీజులో రహానే, పుజారా ఉన్నారు. ఆసీస్ కంటే ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది. మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్(131), లబుషేన్(91) రాణించారు.