టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఎవరూ టీమిండియాకు దూరం చేయలేరని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో కొనసాగుతారని స్పష్టం చేశాడు. ఈ ముగ్గురు భారత క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించిన టీమిండియా.. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో ఐసీసీ టైటిల్ను ముద్దాడింది.

ఈ విజయంపై తాజాగా స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. 'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అద్భుతమైన నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు. భారత క్రికెట్ అభివృద్ధికి ఈ ముగ్గురు ఎంతో చేశారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు.
అద్భుతమైన ఆటతీరుతో.. యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా నిలిచారు. వారి ఆట ఎంతో మందికి స్పూర్తిదాయకం. మైదానంలో పక్కా ప్రణాళికతో ఆడే ఈ ముగ్గురూ టీ20ల నుంచి వైదొలిగినా.. మిగతా ఫార్మాట్లో కొనసాగుతారు. వాళ్లు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ల అద్భుతమైన టీ20 కెరియర్కు అభినందనలు'అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్.. శుభ్మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగియగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. శనివారం నాలుగో టీ20, ఆదివారం చివరి టీ20 జరగనుంది.
ఈ రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా టీమిండియాకే సిరీస్ కైవసం అవుతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్.. శ్రీలంక పర్యటనతో బాధ్యతలను స్వీకరించనున్నాడు. జూలై 27న ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనతో సీనియర్ ఆటగాళ్లంతా రీఎంట్రీ ఇవ్వనున్నారు.