
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై వేటు పడనుందా? నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తదుపరి హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈ ఏడాది నవంబర్లో జరిగే వన్డే ప్రపంచకప్ ఫలితంపై ఈ నిర్ణయం ఆధారపడినట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్లో ఆశించిన ఫలితాన్ని సాధిస్తే ద్రవిడ్ కాంట్రాక్టును పొడగించనున్నారు. లేకుండా అతనికి గుడ్ బై చెప్పి లక్ష్మణ్కు ఆ బాధ్యతలు ఇవ్వనున్నారు.
సోమవారం జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశంలో ఇదే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే ద్రవిడ్ గైర్హాజరీలో భారత్-ఏతో పాటు సీనియర్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే అండర్-19 ప్రపంచకప్ను గెలుచుకోవడంలోనూ లక్ష్మణ్ కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టును సన్నద్దత చేయడంలో కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. అలాగే ఇదే ఏడాది ఆసియా కప్, టెస్ట్ చాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో టెస్ట్లు, వన్డేలకు ద్రవిడ్ కొనసాగిస్తూ.. టీ20లకు ప్రత్యేకంగా మరొక కోచ్ నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైనా బీసీసీఐ సమావేశం భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానాన్ని అమలు చేయాలని బీసీసీఐ పెద్దలు గట్టిగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా విధానాన్ని అమలు చేసి ఇంగ్లండ్ సక్సెస్ సాధించిందని మెజార్టీ బీసీసీఐ సభ్యులు వాదిస్తున్నట్లు సమాచారం.