
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండే తత్వం ధోనీ గొప్పతనమని ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ కొనియాడాడు.
భారత జట్టులో తనతో ఆడిన ఆటగాళ్లలో నైపుణ్యాలు, వారి నుంచి ఏం నేర్చుకున్నానో వివరిస్తానని ఇటీవల లక్ష్మణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ల, జవగళ్ శ్రీనాథ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ల గురించి చెప్పిన ఈ హైదరాబాద్ స్టార్ క్రికెటర్.. ఆదివారం మహేంద్రుడి గురించి మాట్లాడాడు.
ఆటను కేవలం ఆటలానే చూడాలని, చావు-బతుకు సమస్య కాదని చాటి చెప్పిన ఆటగాడని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. 'సమదృష్టి అనే అరుదైన తత్వాన్ని కలిగిన ధోనీ.. ఆటను ఆటగానే చూడాలని, అదేం చావు బతుకు సమస్య కాదని చాటి చెప్పాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటం అతని గొప్పతనం. తన అద్భుతమైన సారథ్యంతో ఆటగాళ్లను ఉత్తేజపరిచి 2007 టీ20 ప్రపంచకప్ అందించాడు.'అని లక్ష్మణ్ కొనియాడాడు. ధోనీ కెరీర్ప్రారంభంలో అతనితో లక్ష్మణ్ ఆడిన విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలోని టెస్ట్ల్లో నెంబర్ వన్ ర్యాంకు అందుకున్న జట్టులో లక్ష్మణ్ కీలక ఆటగాడు.