
న్యూఢిల్లీ: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే కూతురు మరణించగా.. తాజాగా తండ్రిని కోల్పోయాడు. కూతురు మరణించిన బాధలోనే సెంచరీ బాదిన సోలంకి.. రంజీ మ్యాచ్ ఆడుతుండగానే తండ్రి మరణ వార్త తెలుసుకున్నాడు. తీవ్ర దు:ఖంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి వీడియో కాల్ చేసి తండ్రి అంత్యక్రియలు చూశాడు. మ్యాచ్ పూర్తయ్యక ఇంటికి వస్తానని కుటుంబ సభ్యులు ఓదార్చాడు. ఆటపై సోలంకి ఉన్న అంకిత భావం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది.
కాగా, రంజీట్రోఫీలో భాగంగా చంఢీగడ్తో ఇటీవల జరిగిన మ్యాచ్లో విష్ణు సోలంకి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్కు కొద్ది రోజులు ముందు విష్ణు సోలంకి కూతురు మరణించింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి.. హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చంఢీఘడ్తో మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు.
కాగా తన కుమార్తె మరణించిన తర్వాత కుటుంబంతో ఉండమని సూచించినట్లు బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆట మీద మక్కువతో జట్టును విడిచిపెట్టడానికి సోలంకీ ఇష్టపడలేదని అతడు పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో ఆల్రౌండర్ అయిన విష్ణు సోలంకిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు. ఇక బరోడా జట్టు మార్చి 4న హైదరాబాద్తో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.