న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో పరుగుల మోత మోగిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంటే.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం అతన్ని మందలించాడు. సెంచరీ చేసిన వెంటనే అనవసర షాట్కు ప్రయత్నించి ఔటవ్వడం సరికాదని విమర్శించాడు.
గిల్ ఔటయ్యే సమయానికి చాలా ఓవర్లు ఉన్నాయని, క్రీజులో నిలబడితే డబుల్ సెంచరీ చేసేవాడని తెలిపాడు. తాజాగా ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన సెహ్వాగ్.. గిల్ ఔటైన తీరుపై మండిపడ్డాడు. 'తొలి వన్డేలో శతకం చేజార్చుకున్న శుభ్మన్ గిల్.. రెండో వన్డేలో సాధించాడు. అయితే అతను ఔటైన విధానం బాలేదు.

ఎందుకంటే శుభ్మన్ గిల్ ఔటయ్యే సమయానికి ఇంకా 15-18 ఓవర్ల ఆట మిగిలి ఉంది. క్రీజులో నిలబడితే సునాయసంగా 160-180 పరుగులు చేసేవాడు. ఇంకొంచెం ప్రయత్నిస్తే రెండో డబుల్ సెంచరీ బాదేవాడు. శుభ్మన్ గిల్ వయసు 24 ఏళ్లు మాత్రమే. మరో 5-6 ఏళ్ల తర్వాత ఇలా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే శక్తి అతనికి ఉండకపోవచ్చు.
ఫామ్లో ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. అలా అనవసర షాట్లకు ప్రయత్నించి ఔటైపోవడం సరికాదు. రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఈ ఫీట్ను రిపీట్ చేయగల సత్తా గిల్కు ఉంది. ఇదే ఇండోర్ వేదికగా నేను డబుల్ సెంచరీ నమోదు చేశా. ఆ ఇన్నింగ్స్ నాకు చాలా స్పెషల్. ఇండోర్ పిచ్పై ఒక్కసారి సెట్ అయితే ఔట్ చేయడం బౌలర్లకు చాలా కష్టం. గిల్ మంచి అవకాశాన్ని వదులుకున్నాడు.'అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 74 పరుగులు చేసిన శుభ్మన్ గిల్.. రెండో వన్డేలో 104 పరుగులు నమోదు చేశాడు. ఈ ఏడాది ఇప్పటికే వన్డేల్లో 72.35 సగటుతో 1230 పరుగులు చేశాడు. మూడో వన్డేలో అతనికి రెస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్లో గిల్ కీలకం కానున్నాడు.