న్యూఢిల్లీ: సోషల్ మీడియా చాలా చురుకుగా ఉంటే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తనదైన ట్వీట్తో వార్తల్లో నిలిచాడు. మైదానంలో సిక్సర్లు, బౌండరీల బాదినట్లే సెటైర్లు పేల్చడంలో సెహ్వాగ్ ఎక్స్పర్ట్. అతను విసిరే పంచ్లకు అభిమానులు పడిపడి నవ్వుతారు. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించే సెహ్వాగ్.. దానికి కొంచెం హాస్యం కూడా జోడిస్తాడు.
Chicha, Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections. So Chill 🤣 pic.twitter.com/yaiUKxlB1Z
— Virender Sehwag (@virendersehwag) August 11, 2022
తాజాగా ఓ పాకిస్థాన్ రాజకీయ విశ్లేషకుడిని సెహ్వాగ్ ఆటాడుకున్నాడు. క్రీడలపై కనీస అవగాహనలేని అతని అజ్ఞాన్ని బజారుకీడుస్తూ సెటైర్లు పేల్చాడు.
సదరు రాజకీయ విశ్లేషకు భారత్ను తక్కువ చేసేలా చేసిన ట్వీట్లో పెద్ద తప్పు దొర్లడంతో వీరూ తనదైన శైలిలో చురకలంటించాడు. అసలేం విషయం ఏంటంటే.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ అనే పాక్ జావెలిన్ త్రోయర్ 90.18 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఇందులో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా గాయం కారణంగా పాల్గొనలేదు. ఈ పోటీల్లో పాక్ అథ్లెట్ పసిడిని సొంతం చేసుకున్నాడు.
నీరజ్ చోప్రా ఒలింపిక్స్ రికార్డుతో పాటు ఇటీవల ముగిసిన అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నమోదు చేసిన రికార్డును కూడా నదీమ్ చెరిపేసాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్కు చెందిన రాజకీయ విశ్లేషకుడు జైద్ హమిద్ పాక్ అథ్లెట్ను కొనియాడుతూ.. నీరజ్ చోప్రాను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. అయితే, ఇక్కడే అతడు పెద్ద తప్పు చేశాడు. అతనికి నీరజ్ చోప్రా, ఆశిష్ నెహ్రా ఎవరనే విషయం తెలియక తన వ్యాఖ్యల్లో నీరజ్ చోప్రా పేరుకు బదులు ఆశిష్ నెహ్రా పేరును రాసుకొచ్చాడు.
'అర్షద్ నదీమ్ సాధించిన ఈ విజయం మరింత మధురంగా ఉండటానికి కారణం భారత జావెలిన్ త్రోయర్ ఆశిశ్ నెహ్రా రికార్డును బద్దలుకొట్టడం. ఇంతకుముందు జరిగిన ఈవెంట్లో ఆశిష్.. అర్షద్ను ఓడించాడు' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన సెహ్వాగ్ ఆ ట్వీట్ స్క్రీన్షాట్ను పంచుకొని.. 'చిచ్చా.. ఆశిశ్ నెహ్రా ప్రస్తుతం యూకే ప్రధాన మంత్రి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కాబట్టి మీరు చిల్ అవ్వండి' అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.