న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో సంచలన విజయాన్నందుకున్న ముంబై ఇండియన్స్.. టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన రోహిత్ సేన 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన ముంబై.. గుజరాత్తో శుక్రవారం అమీతుమీ తేల్చుకోనుంది.
ఇక సీజన్ ఫస్టాఫ్లో వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. అనంతరం సూపర్ పెర్ఫామెన్స్తో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. కానీ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం కెప్టెన్గా రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడని మండిపడ్డాడు.

లక్నోతో రోహిత్ చేసిన ఆ తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని శాసించేదని, అదృష్టవశాత్తు ముంబై విజయంతో గట్టెక్కిందన్నాడు. క్రిక్బజ్ షోలో ముంబై-లక్నో ఎలిమినేటర్ మ్యాచ్ను విశ్లేషించిన సెహ్వాగ్.. కృనాల్ చెత్త షాట్తో ముంబై గట్టెక్కిందన్నాడు. కృనాల్ ఔటవ్వకుండా ఉండి ఉంటే రోహిత్ చేసిన తప్పిదం అందరికి తెలిసేదన్నాడు.
'రోహిత్ శర్మ కెప్టెన్సీ నన్ను నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా యువ బౌలర్ హృతిక్ షోకిన్కు పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వడం చూసి షాకయ్యా. క్రీజులో సెట్ అయిన డేంజరస్ బ్యాటర్ స్టోయినీస్ ఉండగా.. మేటి బౌలర్కు బౌలింగ్ ఇవ్వకుండా హృతిక్ షోకీన్కు బంతి ఇచ్చాడు. స్టోయినీస్ ఈ ఓవర్లో పండుగ చేసుకున్నాడు.
క్లీన్ హిట్టింగ్తో 18 పరుగులు పిండుకున్నాడు. స్ట్రైక్లో లెఫ్టాండర్ ఉన్నాడనే ఉద్దేశంతో రోహిత్ స్పిన్నర్ను తీసుకొచ్చాడని నేను అర్థం చేసుకోగలను. కానీ సూపర్ ఫామ్లో ఉన్న పియూష్ చావ్లాను కాదని యువ బౌలర్కు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు. హృతిక్ షోకీన్ కాకుండా మరే బౌలర్ వేసినా ఆ ఓవర్లో 6-8 పరుగులు మాత్రమే వచ్చేవి. కానీ షోకీన్ వల్ల లక్నో బ్యాటర్లపై ఉన్న ఒత్తిడి మొత్తం పోయింది.
అదృష్టవశాత్తు స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అనంతరం కృనాల్ పాండ్యా అనవసర షాట్ ఆడి వెనుదిరగడం ముంబైకి కలిసొచ్చింది. కృనాల్ వికెట్ తర్వాత లక్నోఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. ఈ మ్యాచ్లో ముంబై గెలిచినా.. కెప్టెన్గా రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడు. పవర్ ప్లే చివరి ఓవర్ను హృతిక్ షోకీన్కు ఇవ్వడం సరైంది కాదు.
పవర్ ప్లే అనంతరం అతన్ని తీసుకురావాల్సింది. ఎందుకంటే అప్పుడు ఫీల్డర్లు సర్కిల్ బయట ఉంటారు. అప్పుడు బ్యాటర్లు ఆచితూచి ఆడుతారు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఒక దశలో 69/2తో పటిష్టంగా కనిపించిన లక్నో.. కృనాల్ వికెట్ అనంతరం మరో 32 పరుగులకే కుప్పకూలింది. కృనాల్ పాండ్యా సైతం తన వైఫల్యమే జట్టు కొంపముంచిందని తెలిపాడు.