న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మరో ఓటమికి హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే కారణమని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో షిమ్రాన్ హెట్మైర్ విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది.
ఈ ఓటమిపై క్రిక్బజ్ షోలో స్పందించిన సెహ్వాగ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ నిర్ణయాలను తప్పుబట్టాడు. కట్టడిగా బౌలింగ్ చేసిన సీనియర్ బౌలర్, గత మ్యాచ్ విన్నర్ మోహిత్ శర్మకు మరో ఓవర్ ఇవ్వకపోవడమే గుజరాత్ టైటాన్స్ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'మోహిత్ శర్మకు మరో ఓవర్ ఇవ్వకపోవడం గుజరాత్ టైటాన్స్ ఓటమిని శాసించింది.

పేసర్ల కంటే స్పిన్నర్లు రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయగలరని గుజరాత్ టీమ్ నమ్మింది. మోహిత్ శర్మ కంటే స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వికెట్లు తీస్తారని ఆశించింది. కానీ 2 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చిన మోహిత్ శర్మను విస్మరించడం ఏంటో అర్థం కాలేదు. రాజస్థాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.
కానీ గుజరాత్ తమ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన మోహిత్ శర్మ నమ్మకం ఉంచాల్సింది. 2 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చిన మోహిత్కు కనీసం మరో ఓవర్ అయినా ఇవ్వాల్సింది. పైగా అతను గత మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఈ తప్పిదమే గుజరాత్ పతనాన్ని శాసించింది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ డెత్ బౌలింగ్పై ఫోకస్ పెట్టాలి. చివరి మూడు ఓవర్లు వేసే బౌలర్లు ఎవరో నిర్ణయించుకోవాలి.'అని సెహ్వాగ్ సూచించాడు.
మోహిత్ శర్మకు 2 ఓవర్లు మాత్రమే ఇచ్చిన హార్దిక్ పాండ్యా అతనికి మరోసారి బౌలింగ్ ఇవ్వలేదు. నూర్ అహ్మద్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించి అవకాశం ఇవ్వగా.. అతను కీలక వికెట్తో బ్రేక్ త్రూ అందించాడు. కానీ మరో ఎండ్ నుంచి పేసర్లు ధారళంగా పరుగులివ్వడంతో గుజరాత్కు ఓటమి తప్పలేదు. అయితే ఈ సీజన్ ఆడిన ఐదు మ్యాచ్ల్లో గుజరాత్ 3 గెలిచి 2 ఓడింది. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా గుజరాత్ లక్ష్యాలను కాపాడుకోలేకపోయింది.