న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోచ్గా నెహ్రా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తరుచూ ఆటగాళ్లతో మాట్లాడుతూ వారిని అనవసర ఒత్తిడికి గురి చేస్తున్నాడని తెలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్.. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కేకేఆర్ స్టార్ రింకూ సింగ్.. రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ షిమ్రాన్ హెట్మైర్ విధ్వంసంతో సునాయసంగా గెలిచే మ్యాచ్లను గుజరాత్ చేజార్చుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్తో గత ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆశిష్ నెహ్రా పదే పదే ఆటగాళ్లతో మాట్లాడాడు.

స్ట్రాటజిక్ టైమ్ వరకూ కూడా ఆగకుండా బౌండరీ లైన్ వద్దకు వచ్చి ఆటగాళ్లతో మ్యాచ్ వ్యూహాలను డిస్కస్ చేశాడు. అయినా గుజరాత్ టైటాన్స్ ఓటమి తప్పించుకోలేకపోయింది. తాజాగా క్రిక్బజ్ షోలో ఆశిష్ నెహ్రా కోచింగ్ తీరును సెహ్వాగ్ తప్పుబట్టాడు. మ్యాచ్ జరగతుండగా ఆటగాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నెహ్రాకు ఏం ఉందని ప్రశ్నించాడు. అతనేం ఫుట్బాల్ టీమ్ కోచ్ కాదని చురకలంటించాడు.
'చిన్నప్పటి నుంచి ఆశిష్ నెహ్రాను చూస్తున్నాను. అతినికి ఉండే అత్యుత్సాహం గురించి నాకు తెలుసు. అత్యుత్సాహంతోనే స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ వరకు కూడా ఆగలేక బౌండరీ లైన్ దగ్గరకు వెళ్లి ఫీల్డర్తో మాట్లాడుతున్నాడు. హెడ్ కోచ్ అయినా మ్యాచ్ ప్రారంభమైతే డగౌట్లో కూర్చోవాల్సిందే. టీమ్ చేస్తున్న తప్పిదాలను నోట్ చేస్తూ.. దానికి తగ్గ వ్యూహాలు రచించాలి.
కానీ మ్యాచ్ జరుగుతుండగా బౌండరీ లైన్ దగ్గరకు వచ్చి ఆటగాళ్లతో మాట్లాడడం వల్ల వారిలో ఒత్తిడి పెరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మహ్మద్ షమీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆశిష్ నెహ్రా వచ్చి ఏదో చెప్పాడు. ఆ తర్వాత అతను ఆఖరి ఓవర్లో 16 పరుగులు సమర్పించుకున్నాడు.
మ్యాచ్కు ముందు ఎన్ని ప్రణాళికలైనా రచించవచ్చు. అయితే ఒక్క సారి గేమ్ మొదలయ్యాక ప్లేయర్లపైనే పూర్తి భరోసా ఉంచాలి. వారిని స్వేచ్ఛగా ఆడనివ్వాలి. ప్రతీ విషయంలో హెడ్ కోచ్ తల దూరిస్తే ఆటగాళ్లు స్వేచ్చగా ఆడలేరు'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.