హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసమైనా టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలవాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ కోసం తాము 2011 వన్డే ప్రపంచకప్ గెలిచామని చెప్పిన సెహ్వాగ్.. ఇప్పుడు ద్రవిడ్ కోసం గెలవాలని సూచించాడు. ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్కు ప్రపంచకప్ దక్కలేదని, కోచ్గానైనా ఆ ముచ్చట తీర్చాలన్నాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా మరో ఐసీసీ టైటిల్ గెలవలేదు. అప్పటి నుంచి నాకౌట్ దశ దాటలేదు. రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పరాజయాలే ఎదురయ్యాయి. 2022 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో సెమీఫైనల్లో ఓడిన టీమిండియా.. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయంపాలైంది.

టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ టీ20 ప్రపంచకప్తోనే ముగియనుంది. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శన సెమీఫైనల్ చేరిన టీమిండియా.. మరికాసేపట్లో జరిగే ఈ నాకౌట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే .. ఫైనల్లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ వెబ్సైట్తో మాట్లాడిన సెహ్వాగ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'సచిన్ టెండూల్కర్ కోసమే మేం 2011 వన్డే ప్రపంచకప్ ఆడాం. అతని కోసమే టైటిల్ గెలిచాం. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కోసం ప్రపంచకప్ గెలవండి. ప్లేయర్గా ప్రపంచకప్ గెలవని రాహుల్ ద్రవిడ్కు కోచ్గానైనా ఆ ముచ్చట తీర్చండి.
ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రపంచకప్కు మించిన ఎంటర్టైన్మెంట్ ఏది లేదు. రోహిత్ పవర్ ప్లే ఆడితే గొప్ప అనుకున్నా. కానీ అతను పవర్ ప్లే తర్వాత కూడా చెలరేగాడు. తన బ్యాటింగ్తో భారతీయుల మనసులను సంతోషపరిచాడు. ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.