
న్యూఢిల్లీ: తీవ్ర వర్క్లోడ్ కారణంగా పదే పదే గాయాల బారిన పడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. తద్వార అతని పనిభారం తగ్గించుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డాడు. గతేడాది విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన అనంతరం రోహిత్ శర్మ జట్టు పగ్గాలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే గాయాల కారణంగా అతను అన్ని మ్యాచ్లు ఆడలేకపోతున్నాడు.
గాయంతోనే సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన అతను.. తాజాగా కరోనా బారిన పడ్డాడు. దాంతో ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన సెహ్వాగ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.'రోహిత్కు ఇప్పుడున్న వయసు ప్రభావంతో టీ20ల్లో కెప్టెన్గా తప్పుకుంటే.. మానసికంగా బాగుండడమే కాకుండా తన పనిభారాన్ని సైతం సమన్వయం చేసుకోవచ్చు. అలాగే జట్టు యాజమాన్యం ఇంకో సారథిని నియమిస్తే అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకొని తిరిగి టీమిండియాను ఉత్సాహంగా వన్డేలు, టెస్టుల్లో ముందుండి నడిపించవచ్చు' అని పేర్కొన్నాడు.
అయితే, జట్టు యాజమాన్యం అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తే కూడా రోహిత్ శర్మ సమర్థవంతంగా నడిపించగలడని కూడా సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఓ ఫార్మాట్ బాధ్యతలను వదులుకుంటే మరి కొంత కాలం జట్టును నడిపించే ఆస్కారం ఉంటుందని చెప్పాడు. ఇదిలా ఉండగా, ఇటీవల టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఒకేసారి రెండు సిరీస్లు ఆడాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కెప్టెన్లను ఆడించింది. తొలుత గతేడాది శ్రీలంక పర్యటనలో శిఖర్ ధావన్ నేతృత్వంలో టీ20 సిరీస్కు వెళ్లగా అదే సమయంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇప్పుడు కూడా ఒక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా మరో జట్టు ఐర్లాండ్తో ఆడుతుంది.