రిషభ్ పంత్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లుంది: సెహ్వాగ్

న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో అదరగొట్టిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సిరీస్లో రెండు వన్డేలు మాత్రమే ఆడిన ఈ డాషింగ్ లెఫ్టాండర్ 151.96 స్ట్రైక్రేట్, 77.50 సగటుతో 155 పరుగులు చేశాడు. తాజాగా ఈ యువ వికెట్ కీపర్ గురించి మాట్లాడిన సెహ్వాగ్ .. అతన్ని చూస్తే తన కెరీర్ ప్రారంభ రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపాడు. ఇండియా-ఇంగ్లండ్ సిరీస్లో సానుకూలాంశం ఏదైనా ఉందంటే అది రిషభ్ పంత్ ప్రదర్శననే అని కొనియాడాడు.

ఇతరులతో సంబంధం లేదు..
పంత్ సెకండ్ పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్నాడని మెచ్చుకున్నాడు. సానుకూల దృక్పథం కలిగిన పంత్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం మంచిదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. పంత్ తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోడని, తనకు నచ్చిన తీరులో చెలరేగుతాడని తెలిపాడు. 'ఈ సిరీస్లో అతిపెద్ద సానుకూలంశం ఏదైనా ఉందంటే అది రిషభ్ పంతే. ఎందుకంటే వన్డేల్లో అతను మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్కు వస్తాడు. సెకండ్ పవర్ప్లేను అద్భుతంగా వాడుకుంటాడు. అతను జట్టులో ఉండటం చాలా ముఖ్యమని నా అభిప్రాయం. అతను సానుకూల దృక్పథంతో ఉంటాడు. అతన్ని చూస్తే నా కెరీర్ ప్రారంభం రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోడు. తన ఆట తాను ఆడుకుంటాడు.

చివరి వరకు ఉంటే..
ఇదే జోరును కొనసాగిస్తూ పంత్ భారీ స్కోర్లు చేస్తే అతనికి తిరుగుండదు. 50 ఓవర్లు పూర్తిగా ఆడటం నేర్చుకోవాలి. చివరి వరకు బ్యాటింగ్ చేస్తూ ప్రస్తుతం చేస్తున్న 70, 80 పరుగులను సెంచరీలుగా మలిస్తే టీమిండియా తదుపరి సూపర్ స్టార్ అవుతాడు. వికెట్ బాగునప్పుడు, మైదానం చిన్నదైనప్పుడు, నెమ్మదైన వికెట్లపై ఎలా ఆడాలనే విషయాన్ని పంత్ గ్రహించాలి. షాట్స్ ఎప్పుడూ ఆడాలి.. ఎప్పుడూ ఆడవద్దని విషయాన్ని తెలుసుకోవాలి.
ఎలాంటి పరిస్థితుల్లో ఔటయ్యాననే విషయాన్ని సమీక్షించుకోవాలి. పరుగులు చేయలేనప్పుడు లోపం ఎక్కడుందనే విషయాన్ని గ్రహించి ఆటను మార్చుకోవాలి. ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేయడం నేర్చుకుంటే వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా తదుపరి స్టార్ అవుతాడు'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంతే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వికెట్ కీపర్ రిషభ్ పంత్ నడపించనున్నాడు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజ గాయంతో ఈ సీజన్కు దూరమైన నేపథ్యంలో రిషభ్ పంత్ను కెప్టెన్గా నియమిస్తున్నట్లు తెలిపింది. సీనియర్లు అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్లను కాదని.. పంత్కు సారథ్యం అప్పజెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications