
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్కు అతను సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. జట్టులోకి తీసుకోలేని పరిస్థితి ఉంటే కనీసం రిజర్వ్ ప్లేయర్గా అయినా ఎంపిక చేయాలని కోరాడు. 2023 వన్డే ప్రపంచకప్ జట్టులో పృథ్వీ షాను చూడాలనుకుంటున్నానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యంపై మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా నిష్క్రమణకు ఓపెనర్ల వైఫల్యం కూడా ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. జిడ్డుగా బ్యాటింగ్ చేసే రాహుల్,రోహిత్లను పక్కన పెట్టాలని పరోక్షంగా సూచించాడు.
'నేను భారత జట్టులో పృథ్వీ షాను చూడాలనుకుంటున్నాను. ప్రస్తుత టీ20, వన్డే టీమ్ల్లో అతను లేడు. చాలా రోజులుగా టెస్ట్లు కూడా ఆడటం లేదు. అతను మళ్లీ జట్టులోకి తిరిగిరావాలని కోరుకుంటున్నా. 2023 వన్డే ప్రపంచకప్లో అతను ఉంటాడని ఆశిస్తున్నా. టాపార్డర్లో పృథ్వీ షా 150 స్ట్రైక్రేట్తో ఆడగలడు. అతను టీ20 ఫార్మాట్కు సరిగ్గా సరిపోతాడు. కనీసం అతన్ని రిజర్వ్ ప్లేయర్గానైనా తీసుకోవాలి'అని సూచించాడు.
ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్న పృథ్వీ షాను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ద్వితీయ శ్రేణి జట్టులో కూడా చోటివ్వడం లేదు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ సారథ్యంలోని టీ20, వన్డే జట్లలో కూడా పృథ్వీ షాకు చోటు దక్కలేదు. అవకాశం ఇవ్వకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించాడు. సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఇక సెలెక్టర్లు మాత్రం శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్లను ఓపెనర్లుగా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 18 నుంచి న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడికి చేరిన టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ సిరీస్కు కోహ్లీతో పాటు రోహిత్, షమీ, భువీ దూరంగా ఉన్నారు.