న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా చాలా చురుకుగా ఉండే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. భారత వన్డే ప్రపంచకప్ జట్టుపై తనదైన శైలిలో స్పందించాడు. జట్టు ఎంపికపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని సెహ్వాగ్.. ఇండియా పేరును భారత్గా మార్చారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సెక్రటరీ జైషాకు గుర్తు చేశారు.
భారత జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేసిన సెహ్వాగ్.. ఇక టీమ్ భారత్ అని పిలవాలని కోరాడు. 'టీమిండియా కాదు.. ఇక నుంచి టీమ్ భారత్. ఈ ప్రపంచకప్లో కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడ్డూ అని ఛీర్ చేస్తున్నప్పుడు మన ఆటగాళ్ల చాతిపై భారత్ అని ఉండాలి. ఇలా ఉండేలా చూడాలని సెక్రటరీ జైషా గారిని కోరుతున్నా.'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

మరో ట్వీట్లో ఇండియా పేరును భారత్గా మార్చడంపై సెహ్వాగ్ స్పందించాడు. 'ఒక పేరు మనలో గర్వాన్ని నింపేలా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనేది బ్రిటీష్ వారు పెట్టిన పేరు. మన దేశం అసలు పేరు భారత్. ఇది అధికారికంగా తిరిగి రావడానికి చాలా కాలం పట్టింది.'అని తెలిపాడు.
సద్గురుజీ 2014లోనే భారత్ అనే పేరులో ఉన్న సైన్స్, ప్రాముఖ్యతను వివరించారని ఓ వీడియోను పంచుకున్నాడు. భారత్ అని పేరు మార్చడమనేది పార్లమెంట్ పరిధిలోనిదని, కానీ ప్రపంచకప్లో ఆటగాళ్లు భారత్ అనే పేరుతో ఆడేలా జైషా చూడాలని కోరాడు.
గౌతమ్ గంభీర్ కంటే ముందే మీరు ఎంపీ కావాల్సిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తనకు రాజకీయాలు అంటే ఆసక్తి లేదని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. గత ఎన్నికల సమయంలో దేశంలోని రెండు ప్రధాన పార్టీలు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయని తెలిపాడు. ఓ క్రీడాకారుడిగా ప్రజలను అలరించేవాడిగానే ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. రాజకీయాలు తన తత్వానికి సెట్ అవ్వవని బదులిచ్చాడు.
15 మంది సభ్యులతో కూడిన భారత ప్రపంచకప్ జట్టును కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించాడు. ఆసియాకప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే దాదాపు కొనసాగించామని తెలిపిన అగార్కర్.. ఇద్దరు ఆటగాళ్లకే ఉద్వాసన పలికామని స్పష్టం చేశాడు.
భారత ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.