Virender Sehwag: టీమిండియా కెప్టెన్ కావాలని తాను ఏనాడు కోరుకోలేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కెప్టెన్సీ కన్నా ఆటగాడిగా తన బ్యాటింగ్తో అభిమానులను అలరించడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టానని స్పష్టం చేశాడు. ఇక రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియా పగ్గాలను అందుకునేందుకు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికనబర్చాడని, మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్ చేయడం సహించలేకపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తాజాగా జియోసినిమా షోలో సంజయ్ మంజ్రేకర్తో మాట్లాడిన సెహ్వాగ్.. ఈ ఆరోపణలపై స్పందించాడు. టీమిండియా కెప్టెన్ అవ్వడం కంటే ఓ సీనియర్ ఆటగాడిగా జట్టుకు తన సలహాలను అందించడం, ధోనీలాంటి సారథికి అండగా ఉండటాన్నే ఆస్వాదించానని స్పష్టం చేశాడు.

'నేనెప్పుడూ కెప్టెన్ అవ్వాలని అనుకోలేదు. నా పదునైన ఆలోచనలు, వ్యూహాలను ఆటగాళ్లతో పంచుకోవాలనుకున్నాను. ఈ విషయంలో గ్రేగ్ చాపెల్కు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఫామ్ కోల్పోయిన తర్వాత మళ్లీ నాకు వైస్ కెప్టెన్సీ అవకాశం రాలేదు. నా ఆటతో అభిమానులను అలరించాలనుకున్నాను. అంతేగానీ కెప్టెన్సీపై ఏనాడు ఫోకస్ పెట్టలేదు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
పేలవ ప్రదర్శనతోనే తనను సెలెక్టర్లు పక్కనపెట్టారని చెప్పిన సెహ్వాగ్.. కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపాడు. 'ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్ట్ల తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించారనుకుంటా. నాకు గుర్తు లేదు. ఆ తర్వాత సెలెక్టర్లు నావైపు కన్నెత్తి చూడలేదు. దాంతో నాకు నేను రిటైర్మెంట్ ప్రకటించాను. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తారని నేను గట్టిగా నమ్ముతా'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
2013లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెహ్వాగ్ తొలి రెండు టెస్ట్ల్లో విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టిన సెలెక్టర్లు.. సెహ్వాగ్ స్తానాన్ని శిఖర్ ధావన్తో భర్తీ చేశారు. ఆ తర్వాత సెహ్వాగ్కు మరో అవకాశం ఇవ్వలేదు.
భారత్ తరఫున 104 టెస్ట్లు ఆడిన సెహ్వాగ్ 49.34 యావరేజ్తో 8,586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలతో పాటు రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్, సౌతాఫ్రికాపై సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశాడు.