

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతుగా నిలిచాడు. కివీస్ గడ్డపై 11 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ కేవలం 218 పరుగులే చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.ఇక రెండు టెస్టుల సిరీస్లోనైతే మరీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 38 పరుగులే చేశాడు. తన సుదీర్ఘ కెరీర్లో విరాట్ కోహ్లీ ఈ తరహాలో ఏ ద్వైపాక్షిక సిరీస్లోనూ విఫలమవ్వలేదు. దీంతో.. కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీకి మాజీ క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఇప్పటికే కోహ్లీ లోపాలను తెలియజేస్తూ అండగా నిలవగా.. తాజాగా ఈ జాబితాలో సెహ్వాగ్ కూడా చేరాడు. ఈ ఫేలవ ఫామ్ సమస్య తనతో పాటు దిగ్గజ క్రికెటర్లకే తప్పలేదన్నాడు.
'క్రికెట్ ప్రపంచంలో ప్రతీ క్రికెటర్ ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. అప్పట్లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా.. ఇప్పట్లో స్టీవ్స్మిత్ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లకు కూడా ఫామ్లేమి బాధ తప్పలేదు. అంతెందుకు.. నేను కూడా ఈ సమస్యని ఎదుర్కొన్నాను. కానీ.. నా సహజసిద్ధమైన ఆటని మాత్రం వదులుకోలేదు. అయితే.. మళ్లీ ఫామ్ అందుకోవాలంటే.. కాస్త సహనం అవసరం. కోహ్లీ తప్పకుండా మళ్లీ జోరందుకుంటాడు' అని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
గతేడాది బంగ్లాదేశ్తో జరిగిన డే/నైట్ టెస్టులో చివరి సారిగా సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 20 ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ.. ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. మార్చి 12 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్లోనైనా కోహ్లీ మళ్లీ టచ్లోకి వస్తాడని అతని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్కు తెరలేవనుండటంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కోహ్లీ నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.