టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ విధంసకర బ్యాటింగ్తో దుమ్మురేపాడు. తండ్రి తరహాలోనే దూకుడైన ఆటతో డబుల్ సెంచరీ సాధించాడు. ప్రతీష్టాత్మక అండర్-19 క్రికెట్ టోర్నీ కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్.. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఫీట్ అందుకున్నాడు. తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఆటను గుర్తు చేసేలా 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేశాడు.
షిల్లాంగ్ మైదానం వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. ఆర్యవీర్ విధ్వంసకర ద్విశతకంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 468 పరుగులు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ 208 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో ఓపెనర్ అర్ణవ్ ఎస్ బుగ్గాతో కలిసి ఆర్యవీర్ తొలి వికెట్కు 180 పరుగులు జోడించాడు. ఆర్యవీర్(200 బ్యాటింగ్)తో పాటు ధన్యా నక్రా(98 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్లోనే ఆర్యవీర్.. వీనూ మన్కడ్ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. మణిపూర్తో జరిగిన మ్యాచ్లో ఆర్యవీర్ 49 పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తన బాటలోనే నడవాలని ఆర్యవీర్ను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనకిష్టమైన రంగం ఎంచుకునేలా ప్రోత్సహించానని తెలిపాడు. 'నా పిల్లల ఇద్దరిలో మరో వీరేంద్ర సెహ్వాగ్ను చూడాలనుకోలేదు. వారు మరో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మహేంద్ర సింగ్ ధోనీ కావచ్చు. కానీ వారు క్రికెటర్లుగా మారాల్సిన అవసరం లేదు.
వాళ్ల కెరీర్ను వాళ్లు స్వేచ్చగా ఎంచుకోవాలి. అందుకు మేం సాధ్యమైనంత సాయం చేస్తాం. చివరకు వాళ్లు మంచి మనుషులుగా ఉండాలి. అదే మా కోరిక.'అని సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో తమ పిల్లల గురించి చెప్పుకొచ్చాడు.
15 ఏళ్ల తన కొడుకు ఐపీఎల్లోకి అరంగేట్రం చేసేందుకు తెగ కష్టపడుతున్నాడని సెహ్వాగ్ తెలిపాడు. 'కుర్రాళ్లకు ఐపీఎల్ మంచి ఫ్లాట్ఫామ్. గతంలో రంజీ ట్రోఫీ ప్రదర్శనలను ఎవరూ పెద్దగా గుర్తించేవారు కాదు. దాంతో భారత జట్టులో అవకాశాలు దక్కేవి కాదు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో సత్తా చాటితే, నైపుణ్యాలను ప్రదర్శిస్తే వెంటనే భారత జట్టు తరఫున ఆడే అవకాశాన్ని అందుకుంటావు. ఇదంతా ఐపీఎల్ క్రెడిట్. చిన్నరాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి ఐపీఎల్ ప్రధాన కారణం.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.