న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్ విజయానంతరం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ను మోయడం తమ వల్ల కాదని చెప్పామని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించగా.. ఈ ఈవెంట్లో పాల్గొన్న సెహ్వాగ్.. 2011 ప్రపంచకప్ నాటి క్షణాలను నెమరువేసుకున్నాడు.
భారత్ విజేతగా నిలిచిన వెంటనే.. మైదానంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయని, జట్టులోని యువ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ను భుజాలపై ఎత్తుకొని మైదానం మొత్తం కలియదిరిగారరని తెలిపాడు. సచిన్ ఎత్తుకునే పనిని యువ ఆటగాళ్లకు అప్పగించామని గుర్తు చేసుకున్నాడు.

'సచిన్ చాలా బరువు ఉంటాడు. మేం ముసలోళ్లం.. మాకు భుజాల నొప్పులున్నాయి.. ధోనీకి మొకాలి గాయం ఉంది. మరికొందరు ఆటగాళ్లకు ఇతర ఫిట్నెస్ సమస్యలున్నాయి. అందుకే.. సచిన్ను మోసే పనిని యువ ఆటగాళ్లకు వదిలేశాం. మీరెళ్లి సచిన్ను ఎత్తుకొని మైదానంలో రౌండ్ కొట్టి రండి అని చెప్పాం. అందుకే విరాట్ కోహ్లీ సచిన్ను తన భుజాలపై మోశాడు'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఇక 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో జట్టులోని ప్రతీ ఆటగాడు ఓ సెంటిమెంట్ను ఫాలో అయ్యాడని తెలిపాడు. కెప్టెన్ ధోనీ అయితే టోర్నీ ముగిసే వరకు కిచిడీ మాత్రమే తిన్నాడని పేర్కొన్నాడు. భారత్ వేదికగా జరగనున్న ఈ వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలవడానికి రోహిత్ సేనకు మంచి అవకాశమని చెప్పిన సెహ్వాగ్.. ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా తలపడే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు.
అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ ఉండే అవకాశం ఉందన్న సెహ్వాగ్.. వికెట్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ షమీ ఉండే అవకాశం ఉందన్నాడు.
2011 ప్రపంచకప్లో సచిన్ అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నిలో అతడు 9 మ్యాచ్ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేశాడు. మరోవైపు సెహ్వాగ్ 8 మ్యాచ్ల్లో 380 పరుగులు సాధించాడు. ఇక టోర్నీ మొత్తంలో యువరాజ్ చెలరేగిపోయాడు. తొమ్మిది మ్యాచ్లకు గాను 8 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 362 పరుగులు సాధించాడు.. ఇక బౌలింగ్లో కూడా 14 వికెట్లు పడగొట్టాడు.