రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంస జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీలా మరే ఆటగాడు ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించలేరని, అందుకే అతన్ని గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా, దిగ్గజ ప్లేయర్గా పిలుస్తారని చెప్పాడు. క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'జనాలు విరాట్ కోహ్లీ గోట్ లేదా లెజెండ్ అని ఎందుకు పిలుస్తారు? అంటే.. అతను ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపిస్తాడు. తన జట్టు ఓడిపోకుండా చూసుకుంటాడు. అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు విజయం ఖాయమని అనుకునేలా భరోసా ఇస్తాడు. విరాట్ కోహ్లీ కంటే భారీ సిక్సర్లు, మెరుగైన షాట్స్ కొట్టి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ కోహ్లీలా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే ఆటగాళ్లు లేరు. అతను ఒక్కసారే కాదు.. ప్రతీసారి మ్యాచ్లను గెలిపిస్తాడు.'అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2025 సీజన్లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 11 మ్యాచ్ల్లో 143.46 స్ట్రైక్రేట్, 63.13 సగటుతో 505 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 73 నాటౌట్. ఈ టోర్నీలో కోహ్లీ ఇప్పటి వరకు 18 సిక్సర్లతో పాటు 44 బౌండరీలు కొట్టాడు.
విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా సత్తా చాటడంతో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్తో శుక్రవారం ఆడనుంది.