దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం వల్లనే టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్కు తడబడుతున్నారని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. టీ20 ఫార్మాట్ ఎక్కువగా ఆడుతుండటం వల్లనే భారత్లో నాణ్యమైన స్పిన్నర్లు లేకుండా పోయారని అభిప్రాయపడ్డాడు.
ఒకప్పుడు స్పిన్ బౌలింగ్ అంటే భారత బ్యాటర్లు పండుగ చేసుకునేవారు. భారీ షాట్లతో పరుగులు పిండుకునేవారు. దాంతోనే వరల్డ్ బెస్ట్ స్పిన్నర్లు అయిన ముత్తయ్య మురళీ ధరన్, షేన్ వార్న్లు భారత గడ్డపై మెరుగైన గణంకాలు నమోదు చేయలేకపోయారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

టీ20 క్రికెట్ వల్లనే..
స్పిన్ బౌలింగ్ అంటే భారత బ్యాటర్లు హడలెత్తిపోతున్నారు. స్పిన్ ట్రాక్లపై ఏ మాత్రం నిలబడలేక పెవిలియన్కు క్యూ కడుతున్నారు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేకనే ఇటీవల శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ను కోల్పోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై స్పందించిన సెహ్వాగ్.. దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు.
టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల నాణ్యమైన స్పిన్నర్లు రావడం లేదన్నాడు.'ప్రస్తుతం భారత్లో అత్యుత్తమ స్పిన్నర్లు లేరు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమే. టీ20 ఫార్మాట్లో కేవలం 24 బంతులు మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. దాంతో స్పిన్నర్లు బంతిని ఫ్లైట్ చేసి వేసే అవకాశం ఉండదు.
నాణ్యమైన స్పిన్నర్ ఒక్కడు లేడు..
బ్యాటర్లను ఔట్ చేసే బంతుల కంటే డాట్ చేయడంపై స్పిన్నర్లు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాంతో బ్యాటర్లను ఔట్ చేసే నైపుణ్యం సాధించడం స్పిన్నర్లకు కష్టంగా మారింది. అంతేకాకుండా భారత ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్కు దూరమయ్యారు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. ప్రస్తుతం భారత జట్టులో నాణ్యమైన స్పిన్నర్ ఒక్కడు కూడా లేడు.
అంతర్జాతీయ క్రికెట్లో కంటే దేశవాళీలోనే ఎక్కువ స్పిన్ ఆడే అవకాశం దొరుకుతుంది. భారత బ్యాటర్లు స్పిన్ను సమర్థవంతంగా ఆడాలంటే దేశవాళీ క్రికెట్ ఆడటమే ఉత్తమం.
దేశవాళీ క్రికెట్ ఆడాలి..
మా తరంలో ద్రవిడ్, సచిన్, గంగూలీ, లక్ష్మణ్, యువరాజ్ సింగ్.. అందరూ దేశవాళీ క్రికెట్ ఆడేవాళ్లం. వన్డే లేదా నాలుగు రోజుల గేమ్ ఆడటం వల్ల అంతర్జాతీయ క్రికెట్లో మెరుగ్గా రాణించేవాళ్లం. దేశవాళీ క్రికెట్ అనుభవం స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడేది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.